Chandrababu Speech: మిగ్ జామ్ తుపానులో ఏయే పంటలకు ఎంతమేర నష్టం వాటిల్లిందో జగన్ ప్రభుత్వం ఇంతవరకూ చెప్పలేదని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. వర్షాల కారణంగా నీటమునిగిన పంటలను పరిశీలించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొగాకు, మిర్చి, వరి పంటలకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందన్నారు.
పొగాకు, వరి పంటలు పూర్తిగా నీటమునిగి తీవ్రనష్టం జరిగిందని, శనగ ఒక ఎకరానికి రూ.40 వేలు, పత్తి ఒక ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టగా.. ఒక్కరూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. అక్కడ ఉన్న రైతులను మీలో ఎవరికైనా పంట భీమా ఉందా? ఐదేళ్లలో ఒక్కసారైనా పంట భీమా వచ్చిందా ? అని చంద్రబాబు ప్రశ్నించగా.. లేదని సమాధానమిచ్చారు. రాష్ట్రంలో జగన్ పాలన కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉందని దుయ్యబట్టారు.
రైతులకు అన్నీ ఉచితంగా ఇస్తానన్న సీఎం జగన్ ఏమయ్యాడని ప్రశ్నించారు. ఇంతవరకూ ఈ ప్రభుత్వం వర్షాల కారణంగా ఎన్ని లక్షల ఎకరాల్లో పంటనష్టం వచ్చిందో చెప్పలేదని, చెబితే ప్రజలు లెక్కలు అడుగుతారనే అవేవీ బయటకు రానివ్వరని విమర్శించారు. రైతుల కోసం తిరిగే ప్రతిపక్షాలకు ఏం పనిలేదని నిందలేస్తారన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే ముద్దులు పెట్టే సీఎం.. రైతుల కష్టాలను పట్టించుకోడన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లే కట్టలేని సీఎం.. మూడు రాజధానులు కడతాడంటే ప్రజలెలా నమ్ముతారన్నారు.
నష్టపోయిన పత్తి రైతులకు ఎకరానికి రూ.25 వేలు, మిరప రైతులకు రూ.55 వేలు, పొగాకు రైతులకు రూ.40 వేలు, అపరాల రైతులకు రూ.15 వేలు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం కచ్చితంగా మారుతుందని, ఎవరూ అధైర్య పడొద్దని, రైతులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.