Telangana Advisors: తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడుగురిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పదవులు కోల్పోయిన వారిలో.. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ , మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, రాజీవ్శర్మ, మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, మాజీ సీపీ ఏకే ఖాన్, శోభ, జి.ఆర్.రెడ్డి ఉన్నారు.
వీరిలో వ్యవసాయ శాఖకు చీఫ్ ఎడ్వైజర్గా చెన్నమనేని రమేష్ పనిచేస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు.. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్లో మరొకరిని ఎన్నికల బరిలో నిలిపి.. చెన్నమనేని రమేష్కు వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఐదేళ్ల పదవీకాలం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన పదవికి శుభం కార్డు పడింది.
మిగతావారి విషయానికి వస్తే.. సోమేష్కుమార్, రాజీవ్శర్మ ఇద్దరూ.. ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శులు. సీఎస్లుగా వారి పదవీకాలం పూర్తికాగానే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుల పోస్టులిచ్చారు. ఇక, అనురాగ్శర్మ మాజీ డీజీపీ కాగా.. ఏకేఖాన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. శోభ రిటైర్డ్ IFS, ఆర్థికశాఖ సలహాదారుగాజిఆర్ రెడ్డి పనిచేస్తున్నారు.