Chandrababu: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై టిడిపి ఆచితూచి అడుగులు వేస్తోంది. శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు టిడిపి అవసరం ఎంతో ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని తేల్చేశారు. అంతర్గతంగా చేయించే సర్వేల్లో నాయకుల పనితీరు బాగా లేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా చూపించి పక్కన ఉంచుతాం గానీ.. పార్టీ ప్రయాజనాలను పణంగా పెట్టలేమన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఓట్ల అవకతవకల విషయాన్ని ఇన్ ఛార్జ్ లు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఏం జరిగినా పార్టీ అధిష్టానమే చూసుకుంటుందిలే అని అలసత్వం వహించరాదని ఖరాకండిగా చెప్పేశారు. టిడిపి-జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ.. జగన్ ను ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గ్రామస్థాయిలోనూ కలసి పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయిన అంశాన్ని టిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గేటు కొట్టుకుపోయిందని నేతలు ఆరోపించారు. వారంతా చేసిన క్షేత్రస్థాయి పరిశీలనను వివరించారు.