CM Revanth Reddy : తెలంగాణలో అధికారంలోకి వస్తే.. పేదల కష్టాలను తీర్చే ఆరు హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. నేడు రెండు పథకాలను అసెంబ్లీ ప్రాంగణం నుంచి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి సమక్షంలో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10లక్షలకు పెంచారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17, 2023న సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించగా.. నేడు వాటిని అమలు చేసే సమయం వచ్చిందన్నారు. డిసెంబర్ 9 రాష్ట్రానికి పండుగ రోజని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన రోజన్నారు. రాష్ట్రంలో ఉన్న అందరికీ మెరుగైన వైద్యం అందాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర నలుమూలల్లో ఉన్న ఆడబిడ్డలు పైసా ఖర్చు లేకుండా బస్సు ప్రయాణం చేయాలనే మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అనంతరం.. మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ పచ్చజెండా ఊపి ఫ్రీ బస్సును ప్రారంభించారు. ఆ బస్సులోనే ఆడబిడ్డలతో పాటు మహిళా మంత్రులు, శాసనసభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బస్సులో ప్రయాణించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకూ వెళ్లి అక్కడ నివాళులు అర్పించి.. మళ్లీ అదే బస్సులో తిరిగి అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి.. అక్కడి నుంచి మిగతా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు.