Telangana Assembly: తెలంగాణ నూతన శాసనసభ కొలువు దీరింది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారాలు చేయించారు.
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, యశశ్విని రెడ్డి, సీతక్క,దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పర్ణికా రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, లాస్య నందిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఆది శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ,చింతా ప్రభాకర్,విజయరమణారావు, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, గడ్డం ప్రసాద్, గడ్డం వినోద్, గడ్డం వివేక్, గండ్ర సత్యనారాయణ, గంగుల కమలాకర్ తదితరులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాలు చేశారు.
కాగా.. తొలి శాసనసభ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎన్నుకున్నందునే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా ఉంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాలు చేయమని తేల్చేశారు. కాగా.. కేటీఆర్ కూడా తొలిరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాల అనంతరం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు.