మాట ఇచ్చామంటే.. చేసి తీరుతామని.. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ నిరూపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో రెండు పథకాలను అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించింది కాంగ్రెస్ సర్కార్.
తొలుత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే చెప్పిన మాట నిలబెట్టుకుంది. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో.. జీరో టికెట్లను ఆవిష్కరించి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ జెండా ఊపి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.
ఈ పథకం ద్వారా ఇకపై తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ, బాలికలు, యువతులు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు చూపించిన మహిళలకు జీరో టికెట్ ఇస్తారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. అంతర్ రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
కాగా.. ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారు స్థానికతకు సంబంధించిన ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పలు గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుంది. త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్కార్డ్ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీకి రోజువారీ ఆదాయంలో సుమారు సగానికి తగ్గనుండగా.. ఆ మొత్తాన్నీ ప్రభుత్వమే ఆర్టీసీ సంస్థకు చెల్లించనుంది. అనంతరం బాక్సర్ నిఖత్ జరీన్ కు ప్రభుత్వం తరపున రూ.2 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు.