Gambhir vs Sreesanth : అయిపోయిన పెళ్లికి .. ఇప్పుడు బాజాలు అన్నట్టుంది.. ఎప్పుడో అయిపోయిన మ్యాచ్ ఫిక్సింగ్ ని గంభీర్ ఇప్పుడు మళ్లీ రైజ్ చేయడం కరెక్ట్ కాదని సీనియర్లు అంటున్నారు. దానిపై శ్రీశాంత్ ఓవర్ గా రియాక్ట్ కావడం కూడా సరికాదని అంటున్నారు.
ఆరోజున అది కొంతమందికే తెలుసు. ఇప్పుడు శ్రీశాంత్ వీడియో చేయడం వల్ల తెలియని వాళ్లకి తెలిసినట్టయ్యింది, తనకి తానే మరింత డ్యామేజ్ చేసుకున్నాడని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై మ్యాచ్ నిర్వాహకులు శ్రీశాంత్ కి లీగల్ నోటీసులు జారీచేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
లెజెండ్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్బంగా డిసెంబర్ 6న ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ తరఫున శ్రీశాంత్, ఇండియా క్యాపిటల్స్ తరఫున గంభీర్ ఆడుతున్నారు. అయితే శ్రీశాంత్ బౌలింగ్ లో గంభీర్ ఒక సిక్స్, ఫోర్ కొట్టాడు. దీంతో శ్రీశాంత్ ఇరిటేట్ అయ్యాడు. అది గమనించిన గంభీర్ తనని ఫిక్సర్, ఫిక్సర్ అని అన్నాడని శ్రీశాంత్ ఆరోపణ.
ఏమన్నావ్? అంటూ గంభీర్ మీదకు శ్రీశాంత్ వెళుతుంటే అక్కడ అంపైర్లు ఆపారు. అవన్నీ మ్యాచ్ రికార్డింగ్ లో ఉన్నాయని శ్రీశాంత్ చెబుతున్నాడు. కానీ దురదృష్టం ఏమిటంటే, గంభీర్ ని ఒక్కరు కూడా ఏమీ అనడం లేదు. శ్రీశాంత్ మీదే పడటం నిజంగా దారుణమని కొందరు అంటున్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో తనపై వచ్చినవన్నీ నిరాధారణమైనవని కోర్టు తీర్పు వచ్చిన తర్వాత గంభీర్ అలా అనకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అది బౌలర్ ని మానసికంగా ఇబ్బంది పెట్టడమే అంటున్నారు. . ఇదే విషయమై శ్రీశాంత్ ఒక వీడియో చేసి గంభీర్ పై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
టీ 20 టోర్నమెంట్ లో ఆడే కాంట్రాక్టు ను ఉల్లంఘించినందుకు శ్రీశాంత్ కు మ్యాచ్ నిర్వాహకులు నోటీసులు ఇచ్చారు. ముందు ఆ వీడియోలు తీసిన తర్వాతే, వివరణ ఇవ్వమని తెలిపారు. అంతవరకు మాట్లాడవద్దని కూడా తెలిపారు.
ఇదిలా జరగ్గానే శ్రీశాంత్ మరో పోస్ట్ మళ్లీ దబిడి దిబిడే అయ్యింది. ఇదే లీగ్ లో మరో క్వాలిఫయిర్ మ్యాచ్ సందర్బంగా ఇండియా క్యాపిటల్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ను మణిపాల్ టైగర్స్ ఆటగాడు అమితోజ్ సింగ్ రనౌట్ చేశాడు. అద్భుతమైన త్రో అంటూ శ్రీశాంత్ అతన్ని అభినందిస్తూ పోస్ట్ చేశాడు.
అయితే దీనికి గంభీర్ కూడా తను నవ్వుతున్న ఫొటోని ఒకటి షేర్ చేస్తూ,‘ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని ఎవరైనా చూసినప్పుడల్లా మనం నవ్వుతూనే ఉండాలి’ అని కోట్ చేశాడు.
శ్రీశాంత్ భార్య కూడా ఈ వివాదంలో తలదూర్చింది. మ్యాచ్ రికార్డింగ్ లో ఫిక్సర్, ఫిక్సర్ అని గంభీర్ అన్నట్టు స్పష్టంగా ఉంది. అంపైర్లు ఆపినప్పుడు కూడా అతనలాగే అన్నాడు. కానీ ఎవరూ మాట్లాడరు…ఇదేం లోకం తీరు అంటూ బాధపడింది.
ఒక్క శ్రీశాంత్ ని కావాలని టార్గెట్ చేస్తున్నారు. మానసికంగా అతనిపై దాడి చేయడం మానవత్వం అనిపించుకోదు, ఇది చదువుకున్నవాళ్లు చేసే పని కాదని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.