ఏ హోదాలో ఉన్నా సరే.. పెళ్లి చేసుకోవడం కామన్. ఐఏఎస్ లు – ఐపీఎస్ లు పెళ్లిళ్లు చేసుకున్న దాఖలాలున్నాయి. తాజాగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్ ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబర్ 22న వీరి వివాహం జరగనుంది. ఇందులో ఏంటంత స్పెషల్ ? అనే కదా మీ డౌట్. వీరి పెళ్లి స్పెషల్ కాదు. ఆ పెళ్లికి పిలిచిన అతిథులే ఇక్కడ స్పెషల్.
ఎంత గొప్పింటి పెళ్లైనా.. వారి కుటుంబం, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారిని పిలుస్తారు. ఇంకాస్త గొప్పగా ఉండాలంటే.. ఊరంతా పిలుస్తారు. కానీ వీరి పెళ్లికి ఢిల్లీ సహా రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు వెళ్లాయి. రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ లో వివాహం జరుగుతుండగా.. పుష్కర్, అదంపుర్, ఢిల్లీ నగరాలు మూడు రిసెప్షన్లకు వేదిక కానున్నాయి. ఈ వేడుకలకు మొత్తం మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. అందుకే ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది.
భవ్య బిష్ణోయ్ కు ఐఏఎస్ అధికారిణి అయిన పరి బిష్ణోయ్ తో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎంగేజ్ మెంట్ జరిగింది. భవ్య బిష్ణోయ్ అదంపుర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పరి బిష్ణోయ్ 2019లో సివిల్స్ సాధించి.. సిక్కిం క్యాడర్ కింద గ్యాంగ్ టక్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. పరి స్వరాష్ట్రమైన రాజస్థాన్ లో వివాహం. అక్కడే పుష్కర్ నగరంలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
భజన్ లాల్ కాలం నుంచి అదంపుర్ లో బిష్ణోయ్ కుటుంబానికి పట్టుంది. అందుకే ఆ నియోజకవర్గంలో 80 గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానిస్తామని భవ్య తండ్రి కుల్దీప్ వెల్లడించారు. తన పెళ్లి సమయంలో కూడా తన తండ్రి అన్ని ఊర్లు తిరిగి ప్రజలను ఆహ్వానించారని, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. ఇప్పుడు తాను కూడా తన కొడుకు పెళ్లికోసం అదే చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. భవ్య బిష్ణోయ్ కు 2021లో సినీ నటి మెహ్రీన్ తో నిశ్చితార్థం జరిగింది. కొద్దినెలలకే ఆ ఎంగేజ్ మెంట్ బ్రేక్ అయింది.