ఫోన్ మాట్లాడుతూ లిఫ్ట్ లోకి ప్రవేశించి ఓ డెలివరీ బాయ్ మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. జేమ్స్(38) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అశోక్ నగర్ లోని నివాస్ టవర్స్ అపార్ట్ మెంట్ కు పార్సిల్ వెనక్కి తీసుకోవడానికి వెళ్లాడు. నాల్గవ అంతస్తు నుంచి తిరిగి వస్తుండగా లిఫ్ట్ గ్రిల్ డోర్ తెరిచాడు. లిఫ్ట్ పైకి రాక మొదటి అంతస్తులోని ఉంది . ఫోన్ మాట్లాడుతున్న జేమ్స్ ఇది గమనించకుండా లోపలికి వెళ్లాడు. మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పై భాగంలో పడిపోయాడు.
వేరే వ్యక్తి లిఫ్ట్ ఆన్ చేసి పై అంతస్తుకు వెళ్లాడు. లిఫ్ట్ పైభాగంలో ఉన్న జేమ్స్ కు స్లాబ్ తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. మూడో అంతస్తులో లిఫ్ట్ ఆగిపోవడంతో మెకానిక్ వచ్చి మరమ్మత్తులు చేస్తుండగా లిఫ్ట్ పై భాగంలో మృతదేహాన్ని గుర్తించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.