sportswear : మరో ఏడు నెలల్లో పారిస్ ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి. వచ్చే ఏడాది జూలై 26న ప్రారంభమయ్యే ఈ క్రీడా సంబురాలకు ఆటగాళ్ల సంగతేమో కానీ.. స్పోర్ట్స్వేర్ సంస్థలు మాత్రం నంబర్ 1 పొజిషన్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఒలింపిక్స్ క్రీడల వల్ల స్పోర్ట్స్వేర్ అమ్మకాలు ఏ మేర పెరుగుతాయన్నదీ పక్కనబెడితే.. అథ్లెట్లు ధరించే స్పోర్ట్స్వేర్ వల్ల ఆయా బ్రాండ్ల ఉత్పత్తుల పేరు మార్మోగిపోవడం మాత్రం ఖాయం. నైక్, అడీడాస్, పూమా, వీఎఫ్ కార్పొరేషన్, ఆంటా స్పోర్ట్స్ వంటి కంపెనీలు స్పోర్ట్స్వేర్ రంగంలో తీవ్రంగా పోటీపడుతున్నాయి.
2019 అనంతరం గ్లోబల్ మార్కెట్లో ఆడిడాస్ మార్కెట్ షేర్ బాగా తగ్గింది. 2023 ఆర్థిక సంవత్సరం అంచనాల మేరకు ఆ సంస్థను వెనక్కి నెట్టేసి నైక్ ముందుకు దూసుకొస్తోంది. రానున్న పారిస్ ఒలింపిక్స్ ద్వారా మార్కెట్ లో తమ వాటాను పెంచుకునేందుకు ఆయా సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.
లండన్కు చెందిన మార్కెట్ రిసెర్చి కంపెనీ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ అంచనాల మేరకు గ్లోబల్ మార్కెట్లో నైక్ వాటా 18%. ఆడిడాస్ 8.2 శాతంతో రెండో స్థానంలో ఉంది. 3.4% వాటా కలిగిన వీఎఫ్ కార్పొరేషన్ది మూడోస్థానం.
ఆంటా స్పోర్ట్స్(3.1%), పూమా(2.6%) 4, 5 స్థానాలకు పరిమితమయ్యాయి. స్కెచర్స్(2.4%), లూలూలెమన్(2.2%), అండర్ ఆర్మర్(2.1%), న్యూబాలెన్స్(1.5%), లీ నిన్(1.4%) స్పోర్ట్స్ వేర్ కంపెనీలు టాప్ టెన్లో చోటు సంపాదించుకున్నాయి.