Prakasam Crime : విద్యాబుద్దులు నేర్పాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఏకంగా తన ఇంటికి తీసుకొని వెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లా దోర్నాలలో చోటు చేసుకుంది . వివరాల్లోకి వెళితే దోర్నాల జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తున శ్రీనివాస్ ప్రసాద్ ఒక బాలికకు మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆయన చేస్టలకు విసిగిపోయింది. అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.
విద్యార్థిని అన్న బాజీ కోపంతో ఉపాధ్యాయుడి ఇంటికి వెళ్ళి నిలదీశాడు. శ్రీనివాస ప్రసాద్ నన్నే నిలదీస్తావా అంటూ.. కత్తితో బాజీపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాజీకి గాయాలయ్యాయి. వెంటనే బాజీని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన పై పోలీసులు, విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థిని తల్లిదండ్రులు న్యాయం చేయాలని.. ఇలాంటి ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి వారుంటే ఆడపిల్లల్ని చదివించాలనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.