తెలంగాణ కొత్త శాసనసభ నేడు కొలువుదీరనుంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా వారితో ప్రమాణం చేయిస్తారు. కాసేపట్లో రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్తో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి అసెంబ్లీ సమావేశాలు 13 లేదా 14 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పునఃప్రారంభమైన తొలిరోజున శాసన సభాపతిని ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత ఎన్ని రోజులు సభ నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నిక అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయిస్తారు.
మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు లేఖలు రాశారు. సభ్యులందరూ తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని కోరారు. ఇవాళ కొత్త శాసనసభ కొలువుదీరనుండడంతో అసెంబ్లీ భవనానికి రంగులు వేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.
అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా 4 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఎక్కువ మంది గుమికూడడం, సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. అలాగే పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ పరిసరాలలో వాకింగ్ చేసే వారికి ఉదయం 7 గంటల లోపే అవకాశం కల్పించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి, ప్రశాంతతకు భంగం కల్గించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది.