Telangana Schemes : మాట ఇచ్చామంటే.. చేసి తీరుతాం అని.. రేవంత్ రెడ్డి సారధ్యం లోని కాంగ్రెస్ సర్కారు నిరూపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్.. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీల్లో నేడు రెండు హామీలను ప్రారంభించనుంది.
తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని.. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యాక ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టనున్నారు. అలానే ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని కూడా ఈరోజు నుంచి అమలులోకి తీసుకురాబోతున్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణలో నివసిస్తున్న అన్ని వయసుల బాలికలు, మహిళలు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. అంతర్ రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. కాగా ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారు స్థానికతకు సంబంధించిన ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పలు గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది.
ఇక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుంది. త్వరలోనే మహాలక్ష్మి స్మార్ట్కార్డ్ను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీకి సుమారు సగం ఆదాయం తగ్గనుండగా.. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది
అలానే ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందనుంది. అన్ని రాజీవ్ ఆరోగ్య శ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో ఈ పథకం అమల్లోకి రానుంది. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.