Uttarpradesh: చిన్నారి ముఖంపై గేదె పేడ వేయడంతో ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో బుధవారం (డిసెంబర్ 6) సాయంత్రం జరిగింది. కుల్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సతారి గ్రామానికి చెందిన ముఖేశ్ యాదవ్, భార్య నికిత వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి యాదవేంద్ర (3), ఆయుష్ (6 నెలలు) అనే ఇద్దరు మగపిల్లలున్నారు. బుధవారం సాయంత్రం నికిత గేదెలకు మేత వేసేందుకు వెళ్లగా.. అదే సమయంలో ఆయుష్ ఏడవడం మొదలుపెట్టాడు.
దాంతో తల్లి నికిత చిన్నారిని పశువుల పక్కనే కట్టిన ఊయలలో పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత చూసిన తల్లి షాకైంది. ఆ చిన్నారి ముఖంపై గేదె పేడ వేయడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ముఖంపై పేడ ఉండటం వల్ల ఊపిరాడక చిన్నారి మరణించినట్లు జిల్లా ఆసుపత్రి మెడికల్ ఇన్ ఛార్జ్ డాక్టర్ పంకజ్ రాజ్ పుత్ తెలిపారు. పోస్టుమార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.