Protem Speaker : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్గా ఎవరు వ్యవహరిస్తారనే చర్చకు తెరపడింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేస్తారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన చేత ప్రమాణం చేయించనున్నారు.
సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం అత్యధికంగా 8 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేగా మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి రీత్యా సభకు రాలేని పరిస్థితి ఉంది. అలాగే కాంగ్రెస్లో 6 సార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు మంత్రి పదవులు చేపట్టారు. దీంతో ప్రొటెం స్పీకర్ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ఆసక్తి ఏర్పడింది.
మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్యాదవ్ కూడా 6 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అలాగే అక్బరుద్దీన్ ఒవైసీ 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రొటెం స్పీకర్గా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. చివరికి అక్బరుద్దీన్ కు ప్రొటెం స్పీకర్ గా అవకాశం దక్కింది. ఆయన చంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి వరుసగా 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.