Munugodu : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 11.2% శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 11 గంటలకు 25.8 శాతం పోలింగ్ శాతం నమోదైంది. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం లింగవారి గూడెంలో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి అరుణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలోని పోలింగ్ కేంద్రం 173లో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఓటేశారు. మునుగోడు హైస్కూల్ లోని పోలింగ్ బూత్ను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.
కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చండూరులో ఓ ఇంట్లో ఉన్న వారిని స్థానికేతరులంటూ బీజేపీ నేతలు తరిమి కొట్టారు. అయితే బీజేపీ వాళ్లు కూడా ఉన్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. మెదక్, సిద్ధిపేటకు చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు స్థానికంగా తిష్ట వేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మర్రిగూడ మండల కేంద్రంలో బిజెపి కార్యకర్తలు ఆందోళన దిగారు. దీంతో పోలీంగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక ఫంక్షన్ హాల్ లో ఉన్న స్థానికేతరులను ఎన్నికల అబ్జర్వర్ గుర్తించారు. వారి వద్ద ఉన్న నగదును సీజ్ చేశారు. మునుగోడు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సందడి చేస్తున్నారు. 10 వేళ్లకు ఉంగరాలు పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. నారాయణ పూర్లో ఈ సఖీ పోలింగ్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో పోలీంగ్ సిబ్బంది కూడా మహిళలే ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా నియమించిన వాలంటీర్ల సాయమందిస్తున్నారు.