Onion Exports: నిన్న మొన్నటి వరకూ టమాటాల ధరలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పనక్కర్లేదు. కిలో టమాటా రూ.200-250 వరకూ పలికింది. టమాటా కొనడమే కష్టమవ్వడంతో.. దాదాపు చాలామంది దానిని వండుకోవడమే మానేశారు. నిదానంగా టమాటాల ధరలు మళ్లీ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయని ఊరటపడేలోగా.. ఉల్లి.. నేనున్నానంటూ వచ్చింది. కొద్దిరోజులుగా ఉల్లిధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కిలో ఉల్లి రూ.20 నుంచి ఇప్పుడు రూ.50-60 వరకూ పలుకుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లిధరలు పెరుగుతున్నాయి. ఇటీవలే వచ్చిన మిగ్ జామ్ తుపాను ప్రభావం కూడా ఉల్లిధరలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఉల్లిధరలు పెరుగుతుండటంతో.. వాటిని కట్టడి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకూ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లిని అందుబాటులో ఉంచడంతో ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డిసెంబర్ 8 నుంచే.. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది.
ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందే ఓడలలో ఎగుమతుల కోసం లోడ్ అయిన ఉల్లిని, కస్టమ్స్ కు అప్పగించిన లోడ్స్ ను ఎగుమతి చేసుకోవచ్చని డీజీఎఫ్ టీ వెల్లడించింది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా.. ఉల్లి ఎగుమతులపై ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం 40 శాతం కస్టమ్స్ పన్ను విధించింది. అక్టోబరులో దానిని సవరిస్తూ.. కనీస ఎగుమతి ధరను 800 డాలర్లుగా నిర్ణయించింది.