Dowry Harassment: వరకట్నం.. పెళ్లిలో ఆచారమని చెప్తూ.. లక్షలకు లక్షలు.. కాస్త ఆస్తి ఎక్కువుంటే కోట్లు డిమాండ్ చేస్తున్నారు వరుడి తల్లిదండ్రులు. అడిగినంతా ఇచ్చినా.. వారి దాహం తీరక ఇంకా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో భరించలేని ఎందరో గృహిణులు అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా.. వరకట్నం కారణంగా ప్రియుడితో పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన ఓ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంకు చెందిన డాక్టర్ షహానా (26) తల్లి, ఇద్దరు సొదరులతో కలిసి ఉంటూ.. స్థానిక ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తోంది. గల్ఫ్ లో పనిచేసిన ఆమె తండ్రి రెండేళ్ల క్రితమే మరణించారు. షహానా పనిచేస్తున్న ఆసుపత్రిలోనే డాక్టర్ రువాయిస్ తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ.. ఇక్కడే రువాయిస్ కుటుంబం భారీగా కట్నం డిమాండ్ చేసింది.
కట్నం కింద బీఎండబ్ల్యూ కారు, 15 ఎకరాల భూమి, 150 సవర్ల బంగారం ఇవ్వాలని పట్టుబట్టారు. వారు అడిగినంత కట్నం ఇచ్చే స్తోమత షహానా కుటుంబానికి లేకపోవడంతో.. రువాయిస్ కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. దాంతో మనస్తాపానికి గురైన షహానా (డిసెంబర్ 5) బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షహానా ఆత్మహత్యపై దర్యాప్తు చేయాలని మహిళ, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ ను ఆరోగ్యశాఖ మంత్రి జార్జ్ ఆదేశించగా.. పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. కీలక ఆధారాలను సేకరించారు. షహానా సూసైడ్ లెటర్ ఆధారంగా రువాయిస్ కారణమని నిర్థారించి.. గురువారం అతడిని అరెస్ట్ చేశారు.
ప్రభుత్వ వైద్యకళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న రువాయిస్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. నీ కన్నా నాకు డబ్బే ముఖ్యమని రువాయిస్ అన్నాడని షహానా సోదరుడు జాసిమ్ నాస్ వాపోయాడు. అతని తండ్రి తమను దుర్భాషలాడి, హేళన చేశాడని తెలిపాడు. వారు అడిగినంత ఇవ్వలేకపోయినా.. తమకు వీలైనంత ఇస్తామని చెప్పినా అంగీకరించలేదన్నాడు. వరకట్నం కారణంగానే తన సోదరి చనిపోయిందని, రువాయిస్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరకట్నం డిమాండ్ చేస్తే.. ఆ పెళ్లిని తిరస్కరించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మహిళలకు పిలుపునిచ్చారు.