Asifabad : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపల్ దివ్య రాణి తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆహారం సరిగ్గా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల నుంచి బయలుదేరి కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ప్రిన్సిపల్ దివ్య రాణికి తమ సమస్యలను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని విద్యార్థులు తెలిపారు.
విషయం అడిగినందుకు తమపై కక్ష కట్టి భోజనశాలలో భోజనం తినవద్దని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు నన్ను ప్రశ్నిస్తారా అంటూ ఎక్కడ కూర్చొని తింటారో తినండి అంటూ బెదిరించారని విద్యార్థులు ఆరోపించారు. సమస్యలు చెప్పుకునేందుకు ప్రిన్సిపల్ దగ్గరకు వెళితే తన చాంబర్ కు రావద్దని వార్నింగ్ ఇచ్చారని స్టూడెంట్స్ చెప్పారు. టీసీలు ఇచ్చి ఎక్కడ చదవకుండా చేస్తానని భయానికి గురి చేస్తున్నారని విద్యార్థులు అంటున్నారు.
ఈ ప్రిన్సిపల్ తమకు వద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ధర్నా నిర్వహించారు.