Chennai Weather Alert: మిగ్ జామ్ తుపాను ధాటికి చెన్నై చిగురుటాకులా వణికిపోయింది. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు నదులు, చెరువులను తలపించాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భారీ వరదలకు కార్లు, టూ వీలర్లు కొట్టుకుపోయాయి. అధికారుల లెక్కల ప్రకారం సుమారు 27 మంది వరదల కారణంగా మరణించారు. చాలా ప్రాంతాల్లో వరదలు తగ్గకపోవడంతో.. ఇంకా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేదు. శుక్రవారం కూడా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఏపీలో తీరం దాటిన మిగ్ జామ్.. చెన్నై జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఎంత డబ్బున్నా.. సహాయం చేసే చేయి లేకపోతో ఎలా ఉంటుందో చెప్పాలంటే చెన్నై లో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం.
తుపాను తీరందాటినా.. చెన్నైలో వర్షాలు ఆగలేదు. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యల నిమిత్తం 9 వేల మంది అధికారులను రంగంలోకి దించింది. కాగా.. భారీ వర్షాల దెబ్బకు వణికిపోతున్న చెన్నైకు ఐఎండీ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. రానున్న ఐదురోజుల్లో చెన్నై, పాండిచ్చేరి సహా.. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండిగల్, థేనీ, పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.