మిగ్ జామ్ తుపాను.. ఏపీ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చిపోయింది. ఈ అకాల వర్షాల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో కోతకొచ్చిన పంటలు నీటమునిగాయి. తుపాను తీరం దాటి మూడు రోజులవుతున్నా కూడా వరద ప్రభావం తగ్గలేదంటే.. ఈ వర్షాలు ఎంతటి విషాదాన్ని మిగిల్చియో అర్ధం అవుతుంది. కాగా వరి, మిరప, శనగ, కంది, మినుము, పొగాకు, ఉద్యానపంటలు సైతం నీటిలో ఇంకా నానుతున్నాయని.. ధాన్యంలో మొలకలు వస్తున్నాయని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తుండగా.. ఇందులో వరి సుమారు 12 లక్షల ఎకరాలు, మిరప 2.5 లక్షల ఎకరాలు, శనగ, కంది, మినుము 5.50 లక్షల ఎకరాల వరకు ఉంటాయని భావిస్తున్నారు. ఎకరాకు సగటున 20 వేల రూపాయల లెక్కన చూసినా.. పంటనష్టం 4 వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందని వెల్లడవుతుంది. పళ్లు, పూలతోటలు కూడా సుమారు 2.50 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని అంచనా వేస్తున్నారు. వీటికి ఎకరాకు 50వేల రూపాయలు చొప్పున చూసినా.. 1,250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనాకు వస్తున్నారు. తడిసిన ధాన్యంతో నష్టపోయిన మొత్తాన్ని కూడా కలిపితే.. ఇది 7 వేల కోట్ల రూపాయలకు పైగా చేరుతుందని.. పంటలు దెబ్బతిన్న వారిలో 80 శాతం మంది రైతులకు పెట్టుబడిలో పైసా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
తుపాను హెచ్చరికలు మొదలైన నాటి నుంచే 8 జిల్లాల్లోనే తుపాను ప్రభావం ఉంటుందని.. ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతోనే సమీక్షించి ప్రత్యేకాధికారులను కూడా నియమించారు. కానీ ఈ తుపాను ప్రభావం మిగిలిన జిల్లాలపై కూడా చూపడంతో అక్కడి రైతులు కూడా తమని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో శనగ, కంది, మినుము పంటలు నీటిలోనే తేలుతూ దర్శనమిస్తున్నాయి. మరోవైపు వరి సహా మెట్ట పొలాల్లోనూ ఇంకా నీరు నిలిచే ఉంది. జెమిని వైరస్ కారణంగా ఒకటికి రెండుసార్లు నారు తెచ్చి నాటిన రైతులు.. తెగుళ్ల నివారణకు ఎంతో ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా పొలం నుంచి నీటిని బయటకు పంపేలోపే పైరు మొత్తం దెబ్బతింటోందని విలపిస్తున్నారు.
వాణిజ్య ప్రధాన పంటలైన మిరప, పొగాకు, పసుపు రైతులు కూడా ఇప్పటికే ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. వరి రైతులు ఎకరాకు 40 వేల రూపాయలకు పైనే ఖర్చు చేశారు. శనగ, మినుము, కంది రైతులకూ ఎకరాకు 25 వేల రూపాయలకు పైగానే ఖర్చయింది. మరికొద్ది రోజుల్లోనే పంట చేతికి అందుతుందన్న తరుణంలో వారి ఆశలపై తుపాను నీరు కుమ్మరించి తీరని విషాదాన్ని మిగిల్చింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు పంట నష్టం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
.
.