తిరుపతి జిల్లాలో మిగ్జాం తుఫాను అపార నష్టాన్ని కలిగించింది. జిల్లా వ్యాప్తంగా రైతులు వందల కోట్లు నష్ట పోయారు. రహాదారులు వందలాది కీలోమీటర్లు మేర ధ్వంసం అయ్యాయి. చెరువులు సైతము తెగిపోయి వందల ఎకరాల భూములు ఇసుక మేటలు వేసాయి.
జిల్లా వ్యాప్తంగా వరి, వేరుశెనగ, కంది, మిరప తదితర పంటలు 43 వేల ఎకరాల్లల్లో దెబ్బతిన్నాయి. ఇందులో 90 శాతానికి పైగా వరి పంటే ఎక్కువ నష్ట పొయింది. 41,117 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. 1,137 ఎకరాల్లో వేరుశెనగ పంట తుపాను బారిన పడి దెబ్బతిన్నాయి. 245 ఎకరాల్లో కంది పంట, 402 ఎకరాల్లో మిరప పంట దెబ్బతిన్నాయి. వీటిని సాగు చేసిన రైతుల పెట్టుబడి మొత్తం నీటిపాలైంది. జిల్లాలో మొత్తం 84,617 ఎకరాల్లో పంట సాగు చేశారు. అందులో 51 శాతం పంటలు నీటి పాలయ్యాయి.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా 240 చెరువులు దెబ్బతిన్నాయి. వీటిలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. కొన్నింటికి కలుజులు కొట్టుకుపోయాయి. కొన్ని చెరువులకు గ్రామస్తులు, అధికారులు గండ్లు కొట్టి వరద నీటిని వెలుపలికి పంపించారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా చెరువులకు మరమ్మత్తుేలు లేకపోవడమే దీనికి కారణమని రైతులు అంటున్నారు .
244 ఇరిగేషన్ కాలువలు సైతం దెబ్బతిన్నాయి. తెలుగు గంగ కాలువ పలుచోట్ల తెగిపోయింది. సత్యవేడు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖకు రూ. 8.50 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలిక మరమ్మతులకు రూ. 1.30 కోట్లు అవసరమని సంబంధిత శాఖ ప్రతిపాదించింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 32 ప్రధాన రోడ్లు దెబ్బతిన్నాయి. 132 కిలోమీటర్ల మేర రోడ్లు తెగిపోయాయి. 46 రీచ్ల పరిధిలో 1297 మీటర్ల మేర అత్యవసర పునరుద్ధరణ పనులు జరగాల్సి వుంది. తాత్కాలిక మరమ్మతులకు రూ. 1.31 కోట్లు కావాలని ఇరిగేషన్ శాఖ తెలిపింది.
అలాగే శాశ్వత మరమ్మతులకు రూ. 27.08 కోట్లు అవసరమని కోరింది. ఆరు నియోజకవర్గాల్లోని 17 మండలాల పరిధిలో ఈ నష్టాలు సంభవించాయి. ఇదే శాఖకు సంబంధించి 5 నియోజకవర్గాలు, 23 మండలాల్లో 74 గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయి. 233 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతినగా ఇందులో 20 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 208 కిలోమీటర్లు తార్ రోడ్లు, 2.60 కిలోమీటర్లు కంకర రోడ్లు, 3.15 కిలోమీటర్లు మట్టి రోడ్లు వున్నట్టు అధికారులు చెబుతున్నారు.
తాత్కాలిక మరమ్మతులకు రూ. 1.43 కోట్లు, శాశ్వత పనులకు రూ. 72.79 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఈ రెండింటికీ కలిపి రూ. వంద కోట్లు అవసరమవుతుంది . ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో కూడా 97 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బ తిన్నాయి.
విద్యుత్ శాఖ విషయానికి వస్తే మూడురోజులుగా కరెంటు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సూళ్లూరుపేట, తడ మండల కేంద్రాలకు గురువారము 9 గంటల సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు . స్పీడీసీఎల్ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు గురువారం విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. తుపాను ప్రభావంతో 33 కేవీ ఫీడర్లు 70 దెబ్బ తిన్నాయి. అధికారులు 52 ఫీడర్లను సిద్ధం చేశామని చెప్పారు. 11 కేవీ ఫీడర్లు 417 దెబ్బతినగా వాటిలో 350 సిద్ధం చేశామన్నారు.
33 కేవీ విద్యుత్ స్తంభాలు 121 కూలిపోగా 113 స్తంభాలను పునరుద్ధరించారు. గృహ వినియోగ ట్రాన్స్ఫార్మర్లు 533 ధ్వంసం కాగా 92 పునరుద్ధరించామని విద్యుత్ శాఖ తెలిపింది. ఎల్టీ విద్యుత్ స్తంభాలు 852 విరిగి పోగా 590 సిద్ధమయ్యాయి. 11 కేవీ స్తంభాలు 920 పాడగా 704 సిద్ధం చేశామన్నారు.. కేవీబీపురం మండలంలో నాలుగు గ్రామలు, వరదయ్యపాల మండలంలో మూడు గ్రామలు కలిపి మొత్తం ఏడు గ్రామాలకు విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించాల్సివుందని ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు.