మంత్రివర్గ తొలి సమావేశం నేపథ్యంలో.. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా రాష్ట్రంలో కుట్ర జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారు. ఇవాళ దీనిపై సమీక్ష చేయాలని,
ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించవద్దని.. ఇవాళ్టి సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో విద్యుత్తుపై కుట్ర జరిగిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేశారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చీకటి వస్తుందని, తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి.
విద్యుత్ లో కేసీఆర్ ప్రభుత్వం 85 వేల కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ ను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు కేసీఆర్ తెగబడ్డారన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై పూర్తి వివరాలతో రావాలని అధికారులను ఆదేశించారు. సీఎండీల రాజీనామాలు ఆమోదించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవాళ నిర్వహించనున్న రివ్యూ మీటింగ్ కు అధికారులు అందరూ హాజరుకావాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత విద్యుత్తుపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. సోమవారం నుంచి చిమ్మ చీకట్లోకి ప్రజలను నెట్టేందుకు కేసీఆర్ తెగబడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.