Harsha Bhogle : క్రికెట్ ఆటంటే అందరికీ అభిమానమే. అయితే అది దురభిమానం కాకూడదు. ఈ విషయాన్ని అతి స్పష్టంగా ఒక పాకిస్తాన్ నెటిజన్ తలకి ఎక్కేలా ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
2023 వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆటతీరుని వదిలేసి, అక్కడి ప్రజలు ఆ అక్కసునంతా ఇండియాపై చూపిస్తున్నారు. ఒక పాకిస్తానీ ఏం చేశాడంటే 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ లో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ హేళన చేసే విధంగా పోస్ట్ ఒకటి చేశాడు.
ఇది మన భారత్ సీనియర్ కామెంటేటర్ హర్షా భోగ్లే కంట పడింది. దాంతో ఆయనకి వళ్లు మండింది. దానికి రివర్స్ కౌంటర్ ఎంత అందంగా చెప్పాడంటే, బుద్ధి ఉన్నవాడెవడూ ఇంకెప్పుడు అలా మాట్లాడకుండా కౌంటర్ ఇచ్చాడు. ఆ చెప్పే దాంట్లో ఎన్నో అర్థాలు ధ్వనించేలా చెప్పాడు.
అందులో ఒకటి మాది భారతదేశం.. మేమెంతో ఉన్నతంగా, గౌరవంగా ఆలోచిస్తాం, మీలాంటి సంకుచిత మనస్తత్వం కాదు, ఒకవేళ మమ్మల్ని తిట్టినా సరే, అతని స్థాయికి దిగి మేం మాట్లాడం అనే అర్థాలు అందులో స్ఫురించాయి. ఇంతకీ అంత గొప్ప కౌంటర్ ఎలా ఇచ్చాడని మీకూ చూడాలనిపిస్తుంది కదా…అయితే రండి…
2020లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఒక చేదు జ్నాపకంలా మిగిలిపోయింది. ఆడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఓడింది. పింక్ బాల్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే కుప్పకూలింది. క్రికెట్ చరిత్రలో ఇండియా అంత ఘోరంగా అవుట్ కావడం అదే మొదటిసారి. అది ఇంత అడ్వాన్స్ ట్రైనింగ్ ఉండి కూడా అలా జరగడం విచారించదగ్గ విషయమే.
మన ఇండియాకన్నా ఘోరంగా ఆడిన జట్లు ఉన్నాయి. కాకపోతే అవన్నీ1900 దశకంలో జరిగినవి. 1902లో ఆస్ట్రేలియా కూడా 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 1924 సౌతాఫ్రికా 30 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 1955లో న్యూజిలాండ్ 26 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియాకన్నా పైన ఆరు జట్లు ఉన్నాయి.
అయితే ఆనాడు ఆస్ట్రేలియా సిరీస్లో భాగంగా భారత్ చిత్తుగా ఓడిన వీడియోను పాకిస్థాన్కు చెందిన షారూఖ్ ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తాజాగా పోస్టు చేసి, దానికింద ఓ కామెంట్ కూడా చేశాడు. ‘మీకే రోజైనా చెత్తగా అనిపిస్తే.. ఆసీస్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిన ఈ వీడియోనూ చూడండి’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇలా టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. దానికి హర్ష భోగ్లే కౌంటర్ ఇలా ఉంది…
‘హాయ్ షారూఖ్ .. ఈ వీడియోను బయటకి తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ తర్వాతనే టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ గానీ ఆరోజు అలా జరిగి ఉండకపోతే, టీమ్ ఇండియాలో ఇంత గొప్ప మార్పు, ఆత్మ పరిశీలన సాధ్యమయ్యేది కాదు .. ఈరోజున టీమ్ ఇండియా వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్ వరకు వెళ్లిందంటే, మూలాలు అక్కడి నుంచి నేర్చుకున్నవేనని తెలిపాడు.
అద్భుతమైన నాయకత్వ ప్రతిభ, పట్టుదల, కసి ఉంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలం అనే నమ్మకం వస్తుంది. ఇలాంటి ఫెయిల్యూర్స్ ను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకున్నప్పుడు ప్రతీ ఒక్కరిలో చైతన్యం ఉద్భవిస్తుంది. మళ్లీ అలాంటి చీకటి రోజు రాకూడదని అనిపిస్తుంది. మున్ముందు ఇంకా జాగ్రత్తగా పడుతుంది. టీమ్ ఇండియాని ముందుకు తీసుకువెళ్లేలా ప్రోత్సహించిన నిన్ను అభినందిస్తున్నాను అని కౌంటర్ ఇచ్చాడు.
తర్వాత దీంతో పాటు బోనస్ గా ఒక పర్సనాలిటీ డవలప్ మెంట్ కొటేషన్ కూడా పెట్టాడు. ‘ఇతరుల కష్టాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావంటే.. ఇంతకంటే వంకరబుద్ది మరొకటి ఉండదు. కాస్త మెచ్యూర్డ్గా, క్లాస్గా ఆలోచించి చూడు.. ప్రపంచం నీకు అద్భుతంగా కనిపిస్తుంది’అని బాగా అంటించి వదిలాడు. దీనిపై నెట్టింట హర్షా భోగ్లేకు మద్దతుగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.