Ayyannapathrudu Arrested : అయ్యన్న అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేత వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా ఆయన కుమారుడు విజయ్, మూడో నిందితుడిగా మరో కుమారుడు రాజేష్ ఉన్నారు. గురువారం వేకువ జామున సీఐడీ పోలీసులు నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి చేరుకున్నారు. అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ పోలీసులు అయ్యన్నపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Ayyannapathrudu Arrested : భార్య ఆవేదన
అయ్యన్నపాత్రుడుని పోలీసులు కనీసం దుస్తులు మార్చుకోనివ్వలేదని ఆయన భార్య పద్మావతి ఆరోపించారు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్లారని తెలిపారు. మూడేళ్లుగా తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. తన భర్త, కుమారుడికి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
Ayyannapathrudu Arrested : ఇదీ కేసు
అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్ల స్థలంలో అక్రమంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారని ఆరోపణలున్నాయి. ఆ ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారని ఇరిగేషన్ అధికారులు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సీఐడీ అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన పత్రాలను ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో అయన్నపాత్రుడుని అరెస్ట్ చేశారు.