Harry Brooke : ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ గా పేరుపొందిన హ్యారీ బ్రూక్ భారత్ అభిమానులతో పెట్టుకుని ట్రోలింగ్ బారిన పడ్డాడు. అలా వారిని అనకుండా ఉండాల్సిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆరోజున ఒక ఇడియట్ లా వ్యవహరించానని చెప్పి బాధపడ్డాడు. అదెంత పెద్ద పొరపాటో తర్వాత తెలిసిందని అన్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధిక ధర రూ.13.25 కోట్లు పెట్టి హ్యారీ బ్రూక్ ని కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో తను తీవ్రంగా నిరాశపరిచాడు. ఫామ్ కోల్పోయి ఉండటం, బ్యాటర్లు అందరూ ఫెయిల్ కావడం, ప్రతీ మ్యాచ్ ఒత్తిడితో కూడుకోవడంతో సరిగా ఆడలేక, అభిమానుల ట్రోలింగ్ లో పడ్డాడు.
నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఒక్క హ్యారీ బ్రూక్ మాత్రమే కాదు, ఎవరూ సరిగ్గా ఆడలేదు. కానీ తను మాత్రం బలైపోయాడు. నిజానికి ఒకరు కాకపోతే ఒకరు ఆడినా, మ్యాచ్ నిలబడుతుంది. అటు బౌలర్లు, ఇటు బ్యాలర్లు ఎవరూ కలిసికట్టుగా ఆడలేకపోయారు. ముఖ్యంగా టీమ్ స్పిరిట్ లోపించడంతో వైఫల్యాలు వెంట తరుముతూనే వెళ్లాయి.
ఈ నేపథ్యంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ అభిమానులను ఉద్దేశించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ సెంచరీతో ట్రోలర్స్ నోళ్లు మూత పడ్డాయయని అన్నాడు.
ఆ మాటతో.. ప్రతి మ్యాచ్ లో హ్యారీ వెంట పడటం వేధించడం చేశారు.
ఈ గొడవలో పడిన హ్యారీ బ్రూక్, ఆ సెంచరీ తర్వాత పెద్ద పెర్ ఫార్మెన్స్ చేయలేదు. ఓవరాల్ గా సీజన్ మొత్తం కలిపి 11 ఇన్నింగ్స్ లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని వదిలించుకుంది.
ఒకరోజు హోటల్ రూమ్ లో కూర్చుని సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే, నా జీవితంలో చూడకూడని ఎన్నో కామెంట్స్ చూశానని హ్యారీ బ్రూక్ అన్నాడు. తర్వాత చాలాకాలం సోషల్ మీడియావైపే వెళ్లలేదని అన్నాడు. అప్పుడు ఆటపైనే దృష్టి పెట్టానని, ఇప్పుడు గాడిన పడ్డానని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం తను వెస్టిండీస్ టూర్ లో ఉన్నాడు. తొలి వన్డేలో 71 పరుగులు చేశాడు. తను అంటున్నట్టే మళ్లీ ఫామ్ లోకి రావాలని మనం కూడా కోరుకుందాం.