టీమ్ ఇండియాకి కొరుకుడు పడని దేశం ఏదైనా ఉందంటే ఒక్క సౌతాఫ్రికానే అని చెప్పాలి. 1992 నుంచి అంటే 31 సంవత్సరాల నుంచి ఎన్నో సిరీస్ లు ఆడేందుకు మనవాళ్లు వెళ్లారు.. ఉత్త చేతులతో వచ్చేసేవారు. ఒక్కసారి కూడా సౌతాఫ్రికా గడ్డమీద సిరీస్ ని తెచ్చిన పాపాన పోలేదు. మరిప్పుడేమైనా దానిని బ్రేక్ చేస్తారా? చరిత్రని తిరగరాస్తారా? అన్నది చూడాలి. ఎందుకిలా అక్కడ మనవాళ్లు ఆడలేక పోతున్నారంటే అభిమానులు అందరికీ ఎన్నో సందేహాలున్నాయి.
ముఖ్యంగా వాతావరణమే కారణమని చెబుతుంటారు. బౌలర్లు, బ్యాటర్లు ఇబ్బందులు పడుతుంటారు. అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం కావాలని అంటుంటారు. .ఈ వాతావరణ పరిస్థితులను మన క్రికెటర్లు అధిగమించలేకపోవడంతో అంత గొప్ప ఆటగాళ్లు సౌతాఫ్రికా వెళ్లాక చతికిలపడుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ పిచ్ లు కూడా ఒకదానికొకటి పొంతన ఉండవు.
మొన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగినప్పుడు అహ్మదాబాద్ పిచ్ కన్నా అధ్వానంగా ఉంటాయి. ఇక డర్బన్ పిచ్ పై ఆడటం అత్యంత కఠినమైన పరీక్ష అని చెప్పాలి. బౌన్స్ లు వస్తుంటాయి. అవి ముఖాలపైకి వచ్చేలా ఉంటాయి. అంతేకాకుండా సడన్ గా వికెట్ల ముందు పడి స్వింగ్ అవుతుంటాయి. బ్యాటర్లు అర్థం చేసుకునేలోపు వికెట్ ఎగిరిపోతుంది.
చాలా సందర్భాల్లో సౌతాఫ్రికా టూర్ తర్వాత కెప్టెన్సీ పోయిన ఆటగాళ్లున్నారు. సౌతాఫ్రికాలో సిరీస్ విజయం సచిన్ కలగా ఉండేది. తనకి నెరవేరలేదు. గంగూలీ, ద్రవిడ్, కొహ్లీ అందరూ ఉత్త చేతులతోనే తిరిగొచ్చారు. అంత విజయవంతమైన కెప్టెన్ ధోనీకి సాధ్యం కాలేదు.
మరి ఈసారి రోహిత్ ఆధ్వర్యంలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ విజయం సాధిస్తే మాత్రం, మొన్న వరల్డ్ కప్ ఓటమి బాధ నుంచి బయటకి వచ్చినట్టే అని చెప్పాలి. కెరీర్ చివరి అంకంలో ఉన్న రోహిత్ మాత్రం చరిత్ర తిరగరాస్తే, తన జీవితంలో ఇంతకన్నా ఆత్మ సంతృప్తి ఉండదని చెప్పాలి. ఇది తనకు లభించిన ఒక సువర్ణావకాశం అని కూడా చెప్పాలి.
గతంలో వెస్టిండీస్ టూర్ కూడా ఆటగాళ్లకు పరీక్షగానే ఉండేది. ఇప్పుడు ఆ దేశానికి పర్యటనలు తగ్గిపోయాయి. ఇంత కఠినమైన పిచ్ ల మీద ఆజింక్య రహానె, చతేశ్వర్ పుజారా లాంటి అద్భుతమైన టెస్ట్ ప్లేయర్స్ లేకుండా వెళుతోంది. మరి నెట్టుకొస్తారా? లేదా? పాత కథనే పునరావృతం చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.