సంబంధం లేని గొడవలో తనను తీసుకెళ్లి పోలీసులు తివ్రంగా కొట్టారంటూ మనస్తాపానికి గురైన ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
బాధితుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. యర్రగొండపాలెంలోని గాయత్రి సినిమా హాలు సమీపంలో నాగెపోగు నరసింహారావు కుటుంబం నివాసముంటుంది. వారి కుమారుడు మోజేష్ (19) దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు వంతెన పక్కన కొందరు యువకులు గొడవ పడ్డారు. పోలీసులు వెళ్లి.. ఆ సమయానికి అక్కడున్న మోజేష్, సుభానినీ స్టేషన్ కు తీసుకొచ్చారు. ఎస్సై రాజేష్ వారిని తీవ్రంగా కొట్టారు. మోజేష్ తండ్రిని పిలిచి ఇష్టమొచ్చినట్లు దూషించారు. అదేరోజు రాత్రి వారిని ఇంటికి పంపిచిన పోలీసులు బుధవారం మళ్లీ రమ్మని చెప్పారు. బుధవారం ఉదయం సైతం కొట్టి, తన తండ్రిని ఎస్సై, సీఐ ఇష్టమొచ్చినట్లు దుర్బాషలాడటంతో మోజేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికెళ్లి పెట్రోల్ తెచ్చుకొని పోలీసు స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ స్టేషన్ నుంచి బయటకొచ్చి ఎదురు వీధిలోని నీళ్ల డ్రమ్ములో దూకాడు.
ఎస్సై రాజేష్, సిబ్బంది హుటాహుటిన మోజేష్ను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మోజేష్ శరీరం దాదాపు 50 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. అంనతరం అక్కడ్నుంచి మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు మెడికో లీగల్ కేసు కట్టకుండా వైద్యం చేయలేమని చెప్పడంతో బాధిత కుటుంబసభ్యులతో రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అకారణంగా తమ బిడ్డను పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్ ముందున్న జాతీయ రహదారిపై రాత్రి వేళ బైఠాయించి నిరసన తెలిపారు. ఘటనపై మార్కాపురం DSP ఎర్రగొండపాలెంనికి చేరుకొని విచారిస్తున్నారు.