MLC Challa Bhagiratha Reddy : వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన కాలేయ సమస్యతో బాధపడుతున్నారు. ఆదివారం తీవ్రమైన దగ్గుతో ఇబ్బందిపడ్డారు. నంద్యాల జిల్లా అవుకులోని తన స్వగృహం నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అవడంతో వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి భగీరథరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు గురువారం అవుకులో భగీరథరెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చల్లా భగీరథరెడ్డి 1976 మే 28న జన్మించారు. ఓయూ నుంచి MA పొలిటికల్ సైన్స్ అభ్యసించారు. చల్లా భగీరథరెడ్డికి భార్య చల్లా శ్రీ లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2007-2008 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తండ్రి చల్లా రామకృష్ణారెడ్డితో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో భగీరథరెడ్డికి 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఏపీ సీఎం జగన్ అవకాశం ఇచ్చారు.చల్లా భగీరథరెడ్డి అకాల మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.