Revanth Reddy Fight | కేసీఆర్ ను ఎవరూ ఢీకొట్టలేనంతగా ఢీకొట్టారు రేవంత్. కేసీఆర్ పాలన అంతా ప్రజావ్యతిరేకమే అంటూ పెద్ద పోరాటాన్నే నిర్మించారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి ఇప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వీటికి తోడు పార్టీ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించారు. డిక్లరేషన్లు, గ్యారెంటీలతో అధికారం అందుకున్నారు. అందుకే రేవంత్ స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఇప్పుడు మురిసిపోతోంది.
Revanth Reddy Fight | కేసీఆర్ ను ఎవరూ ఢీకొట్టలేనంతగా ఢీకొట్టారు రేవంత్. కేసీఆర్ పాలన అంతా ప్రజావ్యతిరేకమే అంటూ పెద్ద పోరాటాన్నే నిర్మించారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి ఇప్పుడు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. వీటికి తోడు పార్టీ కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించారు. డిక్లరేషన్లు, గ్యారెంటీలతో అధికారం అందుకున్నారు. అందుకే రేవంత్ స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి ఇప్పుడు మురిసిపోతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. డిసెంబర్ 3, 2023న తన లక్ష్యాన్ని చేరుకున్నారాయన. కేసీఆర్ని ఓడించి ఏకంగా సీఎం పీఠాన్నే కైవసం చేసుకున్నారు. రాష్ట్రంలో ఉనికే ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో రేవంత్ దే కీలక పాత్ర. ఇది హైకమాండ్ కూ తెలుసు. తూటాల్లాంటి మాటలు సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుండే స్పీచ్ లు, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో దూకుడు, కార్యకర్తలు, నాయకులను ముందుకు నడపడంలో నాయకత్వ పటిమ ఇవన్నీ రేవంత్ రెడ్డిలో కావాల్సినన్ని ఉన్నాయి. కాకలు తీరిన నేతలు ఉన్న కాంగ్రెస్లో తక్కువ టైంలోనే అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఎం పీఠాన్నే దక్కించుకున్నారు.
తాజా ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించేందుకు వచ్చిన అవకాశాన్ని రేవంత్రెడ్డి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నికలకు వెళ్లేనాటికి పార్టీలో అయిదు మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 64 మంది అభ్యర్థులు గెలిచి అధికారాన్ని దక్కించుకునే వరకు అలుపెరుగని కృషి చేశారు. గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు దక్కేలా చూశారు. టికెట్ దక్కనివారిని బుజ్జగించి.. అందరూ కలసికట్టుగా ముందుకు సాగేలా చూశారు. రెబల్స్ ను పోటీ నుంచి తప్పించారు. కాంగ్రెస్ చరిత్రలోనే మొదటిసారిగా దాదాపు రెబెల్స్ ఎవరూ బరిలో లేకుండా ఎన్నికలకు వెళ్లింది ఇప్పుడే. కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారాలు.., సభలు ఒక ఎత్తైతే.. ఇంకోవైపు రేవంత్రెడ్డి సభలు హైలెట్ గా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు మూడు, నాలుగు సభల చొప్పున 83 సభల్లో రేవంత్ పాల్గొని ప్రచారం చేశారు.
2023 ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీని ఏడాదిన్నర ముందునుంచే సభలతో సమాయత్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను గుర్తించారు. వాటికి కాంగ్రెస్ పరిష్కారాలను అందిస్తుందంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. 2022 మే 6న వరంగల్లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ నుంచి కామారెడ్డిలో ఇటీవల నిర్వహించిన బీసీ డిక్లరేషన్ వరకు వేర్వేరు అంశాలపై పలు ప్రత్యేక హామీలను ప్రకటించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి కీలక కార్యక్రమానికి పార్టీ అగ్రనేతల్లో ఎవరో ఒకరు హాజరయ్యేలా చూసుకున్నారు.
వరంగల్లో రైతు డిక్లరేషన్ సభకు రాహుల్ గాంధీ, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ సభకు ప్రియాంకా గాంధీ, చేవెళ్లలో దళిత డిక్లరేషన్ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరయ్యారు. తొలుత నిర్వహించిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర.. వివిధ జిల్లాల్లో నిర్వహించిన సభలు పార్టీని విజయం దిశగా నడిపించాయి. నిరుద్యోగం, యువత సమస్యల విషయంలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడం కాంగ్రెస్ కు చాలా ప్లస్ అయింది. ధరణి సమస్యలు సహా వివిధ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పార్టీపరంగా 40 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయించారు.
బీజేపీ, బీఆర్ఎస్ లకు దీటుగా పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారం చేయించారు. సోషల్ మీడియాను చాలా వరకు ఉపయోగించుకున్నారు. వాటి ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా స్పందించడం కాంగ్రెస్కు కలిసివచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్ రూం ద్వారా వ్యూహాలను సమర్థంగా అమలు చేయగలిగారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలూ ప్రజల్లోకి బలంగా చేరేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై చేసిన విమర్శలు ప్రజల్లోకి చేరేందుకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ను తెలంగాణలో తొలిసారిగా అధికారం దక్కేలా చేయడంలో రేవంత్రెడ్డి సక్సెస్ అయ్యారు.
రచ్చబండ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ జనంలోకి వెళ్లేలా రేవంత్ చేయగలిగారు. ఒక దశలో రేవంత్ దూకుడుతో కాంగ్రెస్ కు యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది. అదే సమయంలో రేవంత్ మేనియా కూడా రాష్ట్రంలో బాగా బలపడింది. ఇటీవల రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ చేపట్టారు. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇందుకోసం తాను ఒక మెట్టు కాదు.. పది మెట్లు దిగేందుకు సిద్ధమన్నారు. దీంతో వివేక్, రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి వంటి చాలా మంది నేతలు చివరి నిమిషంలో వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. విక్టరీలో ఇది కూడా బాగానే ఉపయోగపడింది.
కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా బీఆర్ఎస్ లోని అసంతృప్తులు.. మాజీ కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తిరిగి రప్పించారు. హైకమాండ్ దగ్గర మంచి మార్కులు సాధించారు. కొడంగల్ ప్రచారానికి ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు రేవంత్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రేవంత్ ను తొలిసారి కలిసినప్పుడు చాలా విషయాలు పంచుకున్నారని, తన 20 ఏళ్ల పోరాటాన్ని వివరించారన్నారు. అదే సమయంలో తనకు ఫలానా పదవి కావాలని ఏనాడూ అడగలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసమే రేవంత్ తపన పడుతున్నారన్న విషయాన్ని బహిరంగ సభ సాక్షిగా చెప్పారు. రేవంత్ కు పదవులపై ఆశ లేదన్న విషయాన్ని సూటిగానే చెప్పేశారు.
ఇప్పుడు రేవంత్ ను సీఎల్పీ లీడర్ గా ఎన్నుకున్న సమయంలోనూ రాహుల్ గాంధీ ఓ మాటన్నారు. రేవంత్ డైనమిక్ లీడర్ అని, సమర్థుడు ఆయనే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే రేవంత్ రెడ్డి హవా హైకమాండ్ దగ్గర ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.