Devi Sri Prasad : రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. సూపర్ హిట్ సంగీత దర్శకుడు. మంచి బీట్ ఉన్న మ్యూజిక్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. వందలాది సినిమాలతో వేలాది హిట్ సాంగ్స్ అందించారు. అప్పుడప్పుడు ఆయనపై కాపీ కాట్ ఆరోపణలు వచ్చినా.. బ్లాక్ బస్టర్లతోనే సమాధానం చెప్పారు. లేటెస్ట్ గా దేవీశ్రీ ప్రసాద్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడం టాలీవుడ్ లో కలకలం రేపుతోంది.
హిందూ మనోభావాలు దెబ్బతీశారంటూ దేవీశ్రీపై సైబర్ క్రైమ్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. చేసింది ఎవరనుకున్నారు.. కరాటే కల్యాణి. ఆమెతో పాటు పలు హిందూ సంఘాలు కూడా ఉన్నాయి.
హరేరామ హరేకృష్ణ మంత్రాన్ని ‘ఓ పారి’ ఆల్బమ్లో ఐటెం సాంగ్ గా మార్చేశారని.. అందుకుగాను సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలనేది ఆ ఫిర్యాదు సారాంశం. పవిత్రమైన ఆ మంత్రాన్ని అశ్లీల దుస్తులు, అశ్లీల డ్యాన్సులతో ఆల్బమ్ క్రియేట్ చేసి.. హిందు మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆ సాంగ్ లో వినిపించే మంత్రాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
‘ఓ పారి’ ఆల్బమ్ ను తెలుగులో ‘ఓ పిల్లా’ పేరుతో తీసుకొచ్చారు. పలు భాషల్లో రిలీజ్ చేశారు. గత నెలలోనే ఈ ఆల్బమ్ విడుదల చేయగా.. అప్పట్లోనే ఈ పాట బాగా వివాదాస్పదమైంది. పలువురు తప్పుబట్టారు. తాజాగా, కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఈ మధ్య పలు వివాదాల్లో కరాటే కల్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అది అలవాటుగా మారిందో.. లేక, వివాదం చేయాలనో.. కారణం ఏదైనా కరాటే కల్యాణి దేవిశ్రీ ప్రసాద్ పై ఫిర్యాదు చేయడం ఆసక్తికరం.