టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన అధినేత పవన్కల్యాణ్ కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు గంటన్నరపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది.
టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ చర్చించారని తెలుస్తోంది. 40 నుంచి 42 వరకు సీట్లు పవన్ కల్యాణ్ అడిగారని సమాచారం. 25 నుంచి 30 సీట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధినేత ఉన్నారంటున్నారు. 5 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారని తెలుస్తోంది. 2 లోక్ సభ సీట్లు ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉందంటున్నారు. డిసెంబర్ చివరి నాటికి అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తున్నారని టాక్.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసే అంశంపైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారని తెలుస్తోంది. తటస్థలు , వైసీపీ నేతలు జనసేనలో చేరికపై చర్చించారట. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చిందని తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఏపీలో త్వరలో 3 చోట్ల ఉమ్మడిగా బహిరంగ సభలు నిర్వహించాలని బాబు-పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికలపైనా చర్చించారని సమాచారం.