Revanth Reddy : తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మళ్లీ వెనక్కి రావాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపువచ్చింది. దీంతో ఎయిర్పోర్టు నుంచి మహారాష్ట్ర సదన్కి వెళ్లారు రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర సదన్లో మానిక్ రావ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు వెళ్లారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పుపై రేవంత్ చర్చించే అవకాశం ఉంది.
మంగళవారం రాత్రి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే రేవంత్ ఢిల్లీ వెళ్లారు . ఉదయం నుంచి బిజీబిజీగా గడిపారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను రేవంత్ రెడ్డి కలిశారు. సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అయ్యారు. తనపై నమ్మకం ఉంచి, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. పార్లమెంట్కు కూడా వెళ్లిన రేవంత్రెడ్డి పలువురు ప్రముఖులను కలిశారు.
మరోోవైపు మంత్రి పదవులపై కాంగ్రెస్ సీనియర్లు దృష్టి పెట్టారు. ఢిల్లీ వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క రెండురోజులుగా అక్కడే మకాం వేశారు. మంత్రి పదవులతోపాటు ప్రాధాన్యత శాఖలు ఇవ్వాలని కోరుతున్నారని తెలుస్తోంది. మరోవైపు శ్రీధర్బాబు, వినోద్, ప్రేమ్సాగర్రావు, మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీ బాట పట్టారు. అధిష్టానం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ సీనియర్లకు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే హైకమాండ్ స్పష్టంచేసింది.
తెలంగాణ సీఎం అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో మంతనాలు కొనసాగుతున్నాయి. దీంతో పార్టీ సీనియర్లు హస్తినలో బిజీ అయ్యారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ఉత్తమ్, భట్టి విక్రమార్కలు భేటీ అయ్యారు.