kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా మిగ్జాం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ములకలపల్లి, దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆమె పర్యటించి అధికారుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఆలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టం వివరాలు అంచనా వేసి తనకు రిపోర్ట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అలానే దమ్మపేట మండలంలో భారీ వర్షం కారణంగా మండల కేంద్రంలోని పేరంటాల చెరువు కాలువ తెగి వరదనీరు పంట పొలాలపై నుంచి పారుతుండటంతో ఆ ప్రాంతాన్ని ప్రియాంక ఆలా సందర్శించారు. అలానే పట్వారి గూడెం గ్రామంలో దెబ్బతిన్న వరి,శనగ, మొక్కజొన్న, పంటను ఆమె పరిశీలించారు. అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి గ్రామంలో తుఫాన్ దాటికి నేలకొరిగిన ఇంటిని ఆమె పరిశీలించారు. తక్షణమే వారికి సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.