T20 World cup : సౌతాఫ్రికా టూర్ కి మూడు ఫార్మాట్లనైతే సెలక్టర్లు చకచకా ఎంపిక చేసేశారు గానీ, గ్రౌండ్ లో ఆడే 11మందిని ఎంపిక చేయడం పెద్ద సవాల్ గా మారింది. ఎందుకంటే ఇక్కడ ఆడి ప్రతిభ చూపించిన వాళ్లే టీ 20 ప్రపంచకప్ కి ఎంపిక అవుతారు. అందుకని అందరినీ పరీక్షించాల్సి ఉంది. కాకపోతే వీరు ఆడేది కేవలం మూడే టీ 20 మ్యాచ్ లు. అందువల్ల ప్రయోగాలకు అవకాశం లేదు.
అంతేకాదు ఆటగాళ్లకు అవకాశాలివ్వాలి. ఏదో ఒకట్రెండు మ్యాచ్ ల్లో చూసి వారి భవిష్యత్తును అంధకారం చేసేయకూడదనే సిద్ధాంతం కూడా ఉంది.ఈ నేపథ్యంలో టీ 20 ప్రపంచకప్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మన్ గిల్ మధ్య ఓపెనర్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు తను మంచి ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశమని చెబుతున్నారు. ఈ క్రమంలో టీ 20 టీమ్ లో కుర్రాళ్లని అడ్జస్ట్ చేయడం పెద్ద శిరోభారంలా టీమ్ మేనేజ్మెంట్ కి మారింది. ఒకప్పుడు ఆడేవాళ్లు లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆడేవాళ్లు ఎక్కువై దిక్కుతోచక ఉన్నారు. ఇదో విచిత్ర సమస్యగా మారింది.
ముఖ్యంగా గిల్-రుతురాజ్ లలో ఎవరిని ఎంపిక చేయాలనేది హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కి సవాల్ గా మారింది. గైక్వాడ్ కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ గిల్ విషయంలో అలా కాదు..స్ట్రయిట్ ఫార్వర్డ్ గా వెళుతున్నాడు. దీంతో గిల్ వైపు మొగ్గు చూపిస్తారా? కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
నిత్యం పరుగులు చేస్తూ ఉంటేనే వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కే అవకాశాలున్నాయనేది అందరికీ తెలిసిన సత్యం. వచ్చే టీ 20 సిరీస్ లో రుతురాజ్-గిల్ మధ్య షూటౌట్ తప్పదని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. అంటే ఎవరో ఒకరు బలికాక తప్పదని అంటున్నాడు. మరేం జరుగుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.