Jabardasth: మల్లెమాల ఎంటర్టైన్ మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో 2013 ఫిబ్రవరి 7న మొదలైన జబర్దస్త్ కామెడీ షో.. ఎంతోమంది ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూయించింది. టీమ్స్ చేసే స్కిట్ లు చూసి.. వారంలో ఒక గంట కడుపుబ్బా నవ్వుకున్నారు ప్రేక్షకులు. 10 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న జబర్దస్త్ షో కు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతోమందికి జీవితాన్నిచ్చిన జబర్దస్త్ షో త్వరలోనే ఎండ్ అవ్వనుందన్న వార్తలతో జబర్దస్త్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
జబర్దస్త్ వేదిక ద్వారా చాలామంది హీరోలు, కమెడియన్స్, డైరెక్టర్లు, సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ విభాగాలుగా మార్చిన తర్వాత రష్మి యాంకరింగ్ చేస్తూ వస్తుంది. ఈ షో కు నాగబాబు, రోజా జడ్జిలుగా ఉండగా.. అనసూయ యాంకర్ గా వ్యవహరించేది. మొదట నాగబాబు, ఆ తర్వాత రోజా జడ్జిలుగా తప్పుకోవడంతో.. ప్రేక్షకులకు షో పై ఆసక్తి తగ్గింది. పైగా స్కిట్స్ లో ముందున్న నేచురల్ కామెడీ కాకుండా.. అడల్ట్ కంటెంట్ పై జోకులు ఎక్కువ అవ్వడంతో.. విపరీతంగా ట్రోల్ చేశారు.
యాంకర్స్ కూడా మారుతూ వచ్చారు. అనసూయ తప్పుకోవడంతో రెండు షో లకు రష్మీనే యాంకర్ గా చేసింది. ఆ తర్వాత మళ్లీ అనసూయ రావడం, మళ్లీ వెళ్లిపోవడంతో ఆమె స్థానంలోకి నటి సౌమ్య రావును తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె కూడా తప్పుకోవడంతో బిగ్ బాస్ 5 బ్యూటీ సిరి హన్మంత్ ను తీసుకొచ్చారు. జడ్జిల విషయమైతే చెప్పనక్కర్లేదు. మనో, కృష్ణభగవాన్, ఇంద్రజ, కుష్బూ.. ఇప్పుడు మహేశ్వరి. ఇలా కొత్తగా ఎవరొకరు మారుతూనే ఉన్నారు.
సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చలకా చంటి, వేణు .. ఇలాంటి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ త్వరలోనే ఎండ్ అవ్వనుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం షో టీఆర్పీ రేటింగ్స్ గణనీయంగా తగ్గడమేనని సమాచారం. 10 ఏళ్లలో ఎప్పుడూ ఇంత తక్కువ టీఆర్పీ రాలేదని తెలుస్తోంది. కమెడియన్స్ కామెడీ పండించడంలో విఫలమవ్వడం, జడ్జ్ లు, హోస్ట్ లు మారుతుండటం కూడా ఇందుకొక కారణంగా తెలుస్తోంది. మరి నిజంగానే జబర్దస్త్ కు ఎండ్ కార్డు పడుతుందా ? లేక షో కు హైప్ రావాలని ఇలాంటి వార్త వైరల్ చేశారా ? అనేది త్వరలోనే తెలుస్తుంది.