Telangana CM : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ , ప్రియాంక, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కలిశారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. మరోవైపు ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులను ఆహ్వానించారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్ కు పిలుపు అందింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేసీఆర్కు కూడా ఆహ్వానం పంపారు. గతంలో ఇన్ ఛార్జీలుగా దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాకూర్ ను ఆహ్వానించారు.
తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్ ను ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు. ప్రొఫెసర్ కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచె ఐలయ్యతోపాటు ఉద్యమకారులకు పిలిచారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు సినీ నటులకు ఆహ్వానిస్తున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపుతున్నారు.