తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార ముహూర్తం మారింది. గురువారం ఉదయం 10 గంటల 28 నిమిషాలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. తాజాగా ప్రమాణస్వీకార కార్యక్రమ సమయాన్ని మార్చారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు నిర్వహించాలని నిర్ణయించారు. AICC అగ్రనేతలను రావాలని ఆహ్వానించామని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తెలిపారు. కేబినెట్ కూర్పుపై చర్చ జరగలేదన్నారు. పార్టీ సైనికుడిగా ఎలాంటి పాత్రనైనా పోషిస్తానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.
తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వకార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత, బందోబస్తు అంశాలపై డీజీపీ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను శాంతికుమారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఎల్బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమ ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలతో పోలీసు అధికారులు, సాధారణ పరిపాలనశాఖ అధికారులు చర్చించారు.
అటు సచివాలయంలోనూ నూతన సీఎంకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ కూడా చేస్తున్నారు.