మిగ్ జాం తుపాన్.. చెన్నైలో తీరని నష్టాన్ని మిగిల్చింది. మొత్తం చెన్నై నగరమంతా.. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జాతీయరహదారులు, రైల్వే మార్గాలు సైతం .. ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం వరదే కనిపిస్తోంది. అంతలా నగరాన్ని తుఫాను తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడప్పుడే చెన్నై ఈ వరదల నుంచి కోలుకునేలా కనిపించడం లేదు. కొన్నిచోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. చిన్న చిన్న ఇళ్ల నుంచి పెద్ద పెద్ద ఇళ్లు సైతం వరదలోనే ఉన్నాయి. చాలామంది ఇంకా సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు. అత్యవసరమైన వారు రక్షణా సిబ్బంది సహాయంతో పడవలపై వెళ్తున్నారు.
కాగా.. భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నైలో 17 మంది మరణించగా.. మరో 11 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. డిస్ట్రిక్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వర్షాల కారణంగా నీటమునిగిన కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఫిషింగ్ బోట్స్, టాక్టర్ల సహాయంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముతియాపేట్ వద్ద 54 కుటుంబాలను వరదల నుంచి రక్షించారు. సాలిగ్రామం నగరంలో అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన బాలింతను బిడ్డతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొట్టుపురంలో ఒక స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి 250 మందిని తరలించారు.
22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వర్షపు నీటిలో చిక్కుకోగా.. వారిని రక్షించి పల్లవరంలోని మిడిల్ స్కూల్ కు తరలించారు. చెన్నై సహా మొత్తం 9 జిల్లాల్లో నీటమునిగిన ప్రాంతాలకు చెందిన వారి కోసం 61,666 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 11 లక్షల ఆహార పొట్లాలు, లక్ష పాల ప్యాకెట్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు.