ఇద్దరు లెజండరీ క్రికెటర్ల మధ్య వివాదం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. వారిద్దరూ ఎవరంటే మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఒకరుకాగా, మరొకరు కింగ్ విరాట్ కోహ్లీ అని చెప్పాలి.
వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకంటే, దానిని సౌరభ్ గంగూలీ వివరించే ప్రయత్నం చేశాడు.
‘దాదాగిరి అన్లిమిటేడ్ సీజన్ 10’ అనే రియాల్టీ షోలో సౌరభ్ గంగూలీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై ఒక ప్రశ్న వచ్చింది. దానికి సౌరభ్ సమాధానం చెబుతూ అందులో తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చాడు.
టీ 20 ప్రపంచకప్ 2021లో కోహ్లీ నాయకత్వంలోని టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలైంది. దీని తర్వాత తనంతట తనే టీ 20 సారథ్యాన్ని వదిలేశాడు. వన్డే ఫార్మాట్, టెస్ట్ క్రికెట్ లో మాత్రం సారథిగా కొనసాగాలని అనుకున్నాడు.
ఆ సమయానికి అధ్యక్షుడిగా ఉన్న నేను, ఒక సీనియర్ గా, అతని కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సలహా మాత్రమే ఇచ్చానని అన్నాడు. వదిలేయమని, తీసేస్తామని అనలేదని అన్నాడు. ఎందుకంటే అప్పటికే అటు ఐపీఎల్ లో, ఇటు టీమ్ ఇండియాలో కూడా కోహ్లీ దారుణమైన ఫామ్ లో ఉన్నాడు.
ఆ సమయంలో టీ 20 కెప్టెన్సీ వదిలేస్తానని అంటే, వన్డే కూడా వదిలేస్తే కెరీర్ బాగుంటుందని చెప్పానని అన్నాడు.. ఆ తర్వాత కొహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి బోర్డు తొలగించింది. దీనిని అవమానంగా భావించిన కొహ్లీ ఏం చేసాడంటే టెస్ట్ కెప్టెన్సీని వదిలేశాడు. ఒకేసారి మూడు ఫార్మాట్లకు గుడ్ బై కొట్టేశాడు.
కనీసం నాకు చెప్పకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారని కొహ్లీ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. మేం అతనికి చెప్పామని గంగూలీ అన్నాడు. దానికి మళ్లీ కోహ్లీ బదులిస్తూ, వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నామని చెప్పడానికే ఫోన్ కట్ చేశారని ఆక్రోశించాడు.
అయితే అక్కడేం జరిగిందో తెలీదు కానీ, గంగూలీకి మాత్రం తర్వాత చాలా అన్యాయం జరిగింది. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన విధానాన్ని బీసీసీఐ ఆఫీస్ బేరర్లు తప్పుపట్టారు. అంతేకాదు గంగూలీ మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగకుండా అడ్డుకున్నారు. అంతేకాదు ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలున్నా మద్దతు ఇవ్వలేదు.
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ డైరక్టర్ గా గంగూలీ ఉన్నాడు. కాకపోతే ఈ వివాదంలో కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఐపీఎల్ సీజన్ లో ఎదురుపడినా కనీసం ఇద్దరూ పలకరించుకోలేదు. ఒకరినొకరు సీరియస్ గా కూడా చూసుకున్నారు. ఇదే విషయాన్ని గంగూలీ ఇంటర్వ్యూలో వివరించే ప్రయత్నం చేశాడు.