మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కర్ణాటకకు చెందిన విజయపుర పట్టణంలో ఘోర దుర్ఘటన జరిగింది. జొన్నమూటలు మీద పడటంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన అక్కడున్నవారి గుండెల్ని పిండేసింది. విజయపుర పట్టణ శివారులోని రాజగురు పరిశ్రమ గోదాములో సోమవారం (డిసెంబర్ 4) రాత్రి ఈ ఘటన జరిగింది. గోదాములో ఉన్న జొన్నమూటలు దొర్లి.. అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడటంతో.. వాటి కింద 11 మంది చిక్కుకున్నారు. సోమవారం రాత్రే నలుగురిని కాపాడి ఆసుపత్రికి తరలించగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మరో ఏడుగురు మూటల కిందే నలిగి మృతి చెందారు. మృతులను బీహార్ కు చెందిన రాజేశ్ ముఖియా (25), రామ్రిజ్ ముఖియా (29), సంబూ ముఖియా (26), రామ్ బాలక్ (38), లోఖి జాధవ్ (56), కిషన్ కుమార్ (20), దాలనచంద ముఖియా (31)లుగా గుర్తించారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారని, రక్తసంబంధీకులని విజయపుర జిల్లా అధికారి టి.భూబాలన్ వెల్లడించారు.
భారీయంత్రం పక్కనే వందల మూటలుండటంతో.. ఆ యంత్రం కుదుపులకు మూటలు ఒక్కసారిగా కుప్పకూలి ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. కార్మికులు చనిపోయిన పరిశ్రమ యాజమాన్యంపై విజయపుర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. సంస్థ యజమాని అయిన కిశోర్ కుమార్ జైన్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారాలను అందజేస్తామని ప్రకటించారు.