సీఎంగా ఉన్నప్పుడు.. అయితే ప్రగతి భవన్, లేదంటే ఫామ్హౌస్లో మాత్రమే ఉన్నారనే అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు. ప్రగతి భవన్లో ఆయన ఉన్నా.. అందరికీ అక్కడ ఎంట్రీ ఉండేది కాదు. బాస్ అనుమతి ఉంటేనే ఎవరైనా ప్రగతి భవన్లోకి అడుగుపెట్టేవారు. ఇక సీఎం హోదాలో కేసీఆర్ సెక్రటేరియట్కి వెళ్లారో లేదో కూడా ఎవరికీ గుర్తు లేదు. కొత్త సచివాలయం కట్టాక కొన్నిసార్లు అక్కడ సమీక్షలు నిర్వహించిన కేసీఆర్.. నేతలతో పాటు సామాన్యులెవర్నీ అందులోకి అడుగుపెట్టనివ్వలేదు. రేవంత్రెడ్డి, సీతక్క లాంటి వాళ్లు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా… అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేవారు. ఇక సామాన్యుల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.
ఎన్నికల్లో గెలిస్తే… ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని కాంగ్రెస్ భరోసానిచ్చింది. కేసీఆర్లా తాము వ్యవహరించబోమని, ప్రజాపాలన సాగిస్తామని రేవంత్రెడ్డి ముందు నుంచీ చెబుతున్నారు. సెక్రటేరియట్ను ప్రజా సమస్యలు తీర్చే పాలనా భవన్గా మారుస్తామన్నారు. ఇక ప్రగతిభవన్ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్గా మార్చి.. సీఎం హోదాలో తాను సామాన్యులను నేరుగా కలుస్తానని కూడా చెప్పారు. దాంతో కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఉన్నారు.