టీమ్ ఇండియా ఆల్ రౌండర్, అవసరమైనప్పుడు బౌలర్ గా, సమయం వచ్చినప్పుడు బ్యాటర్ గా ఉపయోగపడుతూ జట్టుకి సమతూకంగా నిలిచిన హార్దిక్ పాండ్యా ఫైనల్ మ్యాచ్ లో లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే సమయంలో ఐదుగురు బౌలర్లు ప్రభావం చూపలేని సమయంలో ప్రత్యామ్నాయంగా ఆరో బౌలర్ గా హార్దిక్ ఉండేవాడు. అది కెప్టెన్ రోహిత్ కి కలిసి వచ్చేదని అంటున్నారు.
టీమ్ ఇండియా క్లిష్ట సమయంలో తను వీరోచిత పోరాటం చేస్తాడు. ఆ కసి, కోపం, తపన కలిసి రెట్టించిన శక్తితో బౌలింగ్ చేస్తాడు. అంతేకాదు విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరి భాగస్వామ్యం భారీ స్కోరు చేయలేకపోవడంతో, ఆ సమయంలో పాండ్యా ఉండి ఉంటే, మరోలా ఉండేదని కూడా అంటున్నారు.
అందుకనే బీసీసీఐ ఇప్పుడు హార్దిక్ పాండ్యా మీద దృష్టి పెట్టింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కాలు అడ్డం పెట్టి గాయపడిన పాండ్యా జట్టుకి దూరమయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా తో టీ 20 సిరీస్ అయిపోయింది. టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో మూడు జట్లు సౌతాఫ్రికా వెళుతున్నాయి. అందులో కూడా తను ఆడటం లేదు.
మరో ఆరునెలల్లో టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ఈలోగా తనని సన్నద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకని హార్దిక్ తమకి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసింది. సుమారు 18 వారాల పాటు NCAతో పాటు పర్యవేక్షించనుంది.
ఈసారి హార్దిక్ ఆరోగ్యంపై ప్రతిరోజు అప్ డేట్ ను ఇవ్వమని చెప్పినట్టు సమాచారం. 2024 మార్చిలోపు ఈ స్టార్ ఆల్ రౌండర్ మైదానంలో పూర్తి ఫిట్ నెస్ తో అడుగుపెట్టేలా బీసీసీఐ ప్లాన్ వేసింది.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో కుర్రాళ్లు అద్భుతంగా ఆడారు. మరి సీనియర్లు రోహిత్ శర్మ, ఒకవేళ వస్తే కొహ్లీ, ఇప్పుడు హార్దిక్, రవీంద్ర జడేజా, గిల్, అయ్యర్, మహ్మద్ షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్ ఇలా తొమ్మిది మంది వచ్చేస్తే, ఇప్పుడు ఆడిన జట్టులోంచి ఇద్దరికే అవకాశం ఉంటుంది.
అందులో ఒకరు బౌలర్, ఒకరు బ్యాటర్ కావాలి. అలాగైతే బ్యాటింగ్ లో రుతురాజ్, రింకూ సింగ్ రేస్ లో ఉంటారు. బౌలింగ్ లో చూస్తే అక్షర్ పటేల్, బిష్ణోయ్ లైన్ లో ఉన్నారు. మొత్తానికి వచ్చే టీ 20 వరల్డ్ కప్ కి జట్టు కూర్పు బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిని తెచ్చేలాగే ఉంది.