కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే, ఏడుకొండలపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు.. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. తిరుమలకు వచ్చిన భక్తులకు ప్రతినిత్యం అన్నప్రసాద పంపిణీ జరుగుతుంది. క్యూలైన్లో ఉన్నవారికి, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు, స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన వారందరికీ అన్నప్రసాదం అందిస్తారు. అయితే.. తాజాగా తిరుమలలో అన్నప్రసాదం సరిగ్గా లేదంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నప్రసాదం విషయమై.. భక్తులు టిటిడి సిబ్బందిపై తిరగబడ్డారు. సోమవారం (డిసెంబర్ 4) రాత్రి కొందరు అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు అన్నదాన కేంద్రానికి రాగా.. ఆకుల్లో సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం ఉడకలేదని వాపోయారు. అన్నం ముద్దగా ఉందంటూ అక్కడ విధుల్లో ఉన్న టిటిడి ఉద్యోగి చెంగల్రాయులతతో వాగ్వాదానికి దిగారు.
“ఇది అసలు అన్నమేనా.. ఎవరూ తినలేకపోతున్నారు. మీరే చూస్తున్నారుగా ఎంతమంది ఆకుల్లో వదిలేసి వెళ్లిపోతున్నారో.. చాలా దారుణంగా ఉంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదానం సూపరింటెండెంట్ ను పిలవాలని గొడవకు దిగారు. అయితే.. చలి వల్ల అన్నం ఆరిపోయి అలా అయిందని సదరు ఉద్యోగి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా భక్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారికి కోట్ల రూపాయల్లో కానుకలు సమర్పిస్తోంటే.. మీరు కనీసం తినడానికి నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారంటూ మహిళలు సైతం ప్రశ్నించారు. అక్కడ జరిగిన గొడవ, ఆకుల్లో వడ్డించిన అన్నప్రసాదాన్ని వీడియో తీసి మీడియాకు విడుదల చేశారు.
అన్నప్రసాదం విషయమై భక్తులు చేసిన గొడవపై టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. దేశవ్యాప్తంగా భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తోన్న ఆలయాల్లో టిటిడినే ప్రథమ స్థానంలో ఉందని, కొందరు భక్తులు మాత్రమే దీనిపై ఇలాంటి ఆరోపణలు చేయడం పలు అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. ఇందులో తమ పొరపాట్లేవైనా ఉంటే సరిదిద్దుకుంటామన్నారు.