మిగ్జాం తుపాన్ బలహీనపడ్డది. ఉత్తరం వైపు కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక తుపాన్ ఎఫెక్ట్.. ఎయిర్పోర్టు, రైల్వేశాఖపై పడింది. విజయవాడ మీదుగా వెళ్లే 145 రైళ్లు రద్దు అయ్యాయి. గన్నవరం ఎయిర్పోర్టుకు రావాల్సిన పలు విమానాలు రద్దు అయ్యాయి.
ఇక మిగ్జాం తుపాన్ ధాటికి ఏపీ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వరణుడు విరుచుకుపడటంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. దీంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా అరటిపంటపై తుపాన్ ఎఫెక్ట్ పడింది. భీకర గాలులకు అరటి చెట్లు ఎక్కడికక్కడ కుప్పకూలాయి. పంట చేతికొచ్చే సమయంలో నీటిపాలు కావడంతో లబోదిబోమంటున్నారు రైతన్నలు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 ఎకరాల్లో ఉద్యాన పంటలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది.