హైకమాండ్ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో రేవంత్కు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.. ఘనస్వాగతం పలికారు. AICC నాయకురాలు సోనియాగాంధీని కలిశారు రేవంత్ రెడ్డి. రేపు జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అంతకుముందు.. రేవంత్ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ తోనూ సమావేశమయ్యారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలను విడివిడిగా కలిశారు. ఏఐసీసీ ముఖ్యనేతలను ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధిష్టానం పెద్దలను ఆహ్వానించారు. ఉపముఖ్యమంత్రితోపాటు మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలి అనేదానిపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించారు.
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి పేరును మంగళవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయించారని వెల్లడించారు. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి పేరును అనౌన్స్ చేశారు. అయితే నిన్న రేవంత్ను ఢిల్లీ రావాలని హైకమాండ్ ఆదేశించింది. ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నిన్న సాయంత్రం ముఖ్యనేతల సమక్షంలో చర్చలు జరిపి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారు.