ఇటు మెజార్టీ ఎమ్మెల్యేలు.. అటు కాంగ్రెస్ అధిష్ఠానం అండగా నిలవడంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్రెడ్డికి పెద్దగా అవరోధాలు ఎదురుకాలేదు. సీఎల్పీ మాజీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డిలు పోటీ పడినా.. ఎన్నికల్లో రేవంత్రెడ్డి కృషి, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం, పీసీసీ అధ్యక్షుడిగా స్టార్ క్యాంపెయినర్గా ముమ్మరంగా పర్యటించడం లాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈయన వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.
పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ స్వయంగా రేవంత్ పేరును సూచించగా.. ఇతరులూ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఆది నుంచీ పోటీలో మిగిలిన వారికంటే రేవంత్రెడ్డి ముందున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా చూసుకోవడం, ఇతర పార్టీల్లోని ముఖ్యులను కాంగ్రెస్లోకి వచ్చేలా చేయడంతోపాటు వారికి టికెట్లు ఇప్పించడం.. ఇలా అన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు.
భట్టి, ఉత్తమ్.. ముఖ్యమంత్రి రేసులో నిలవగా, వీరితోపాటు డీకేను కలిసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు తమకున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేయడంతోపాటు ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు తీసుకున్నారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలు నేరుగా రేవంత్రెడ్డి పేరు చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేవంత్రెడ్డి సీఎం ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.