Revanth Reddy Congress | రేసులో లేదనే స్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ రేసు గుర్రం ఎలా అయ్యింది? కేసీఆర్ ఖేల్ ఖతం చేసే స్థితి ఎలా సాధ్యమైంది…. ఎన్నికల ముందు రెండు నెలల్లో ఏం జరిగింది ? కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా పెరింగింది ? రేవంత్ రెడ్డి పొలిటికల్ బాహుబలి ఎలా అయ్యాడు ? ఆయన విజయ రహస్యాలను ఇప్పుడొకసారి తెలుసుకుందాం.
Revanth Reddy Congress | రేసులో లేదనే స్థితి నుంచి కాంగ్రెస్ పార్టీ రేసు గుర్రం ఎలా అయ్యింది? కేసీఆర్ ఖేల్ ఖతం చేసే స్థితి ఎలా సాధ్యమైంది…. ఎన్నికల ముందు రెండు నెలల్లో ఏం జరిగింది ? కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా పెరింగింది ? రేవంత్ రెడ్డి పొలిటికల్ బాహుబలి ఎలా అయ్యాడు ? ఆయన విజయ రహస్యాలను ఇప్పుడొకసారి తెలుసుకుందాం.
ఇప్పటి వరకూ ఒక లెక్క… ఇక మీద మరోలెక్క… టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశిస్తూ చెప్పిన మాటలివి. కేవలం మాటలకే పరిమితం కాలేదు… ఆచరణలో చేసి చూపించాడు. తెలంగాణలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీకి 119 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా అంటూ అధికార పక్షం హేళన చేసేది. తెలంగాణలో హ్యాట్రిక్ పక్కా అంటూ అధికార బీఆర్ఎస్ ధీమాగా ఉండేది. మరోవైపు డబుల్ ఇంజిన్ సర్కార్ పక్కా అంటూ కాషాయ దళం హల్ చల్ చేసేది. ఎక్కడ చూసినా… ఎవరు మాట్లాడుకున్నా పొలిటికల్ సీన్ ఇలానే ఉండేది. జస్ట్ రెండు నెలల్లో తెలంగాణ పొలిటికల్ వార్ ని పూర్తిగా ఒక్కడే మార్చేశాడు. అతడే రేవంత్ రెడ్డి.
నిజమైన నాయకుడు ప్రజల నుంచి పుట్టుకువస్తాడు. కష్టాల నుంచే జననేత పుట్టుకువస్తాడు అనేది చరిత్ర చెప్పిన సత్యం. తెలంగాణలో రెవంత్ రెడ్డి విషయంలో అది మరోసారి నిజమైంది. ప్రభుత్వ వ్యతిరేకతనంతటినీ ఒక చోటుకు చేర్చగలిగాడు. అహంకారం రాష్ట్రంలో తాండవిస్తోందని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ ఎమోషన్ ని కరెక్ట్ గా పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ వాదులనందరినీ, ముఖ్యంగా కేసీఆర్ నుంచి అవమానాలను ఎదుర్కొన్న వారందరినీ ఒక్కచోటకి చేర్చాడు. వారందరితో కొత్త జట్టు కట్టాడు. వారందరితో కాంగ్రెస్ జెండా పట్టించాడు.
కేసీఆర్ తరచూ వాడే సెంటిమెంట్ అస్త్రం మీదే బలంగా దెబ్బ కొట్టాడు రేవంత్. బీఆర్ఎస్ – బీజేపీ ఒకటే అని వినిపిస్తోన్న అభిప్రాయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాడు. దూకుడు పెంచాడు. పదునైన మాటలతో కేసీఆర్ కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. మాటల్లో పదును కొనసాగిస్తునే… ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టాడు. కేసీఆర్ తరచూ చెప్పే నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ నే కేసీఆర్ మీద ఎక్కుపెట్టాడు. నీళ్ల పేరిట కాలేశ్వరంలో జరిగిన అవినీతిని బలంగా వినిపించాడు. ప్రజల్ని తన ప్రసంగాల వైపు తిప్పుకోగలిగాడు. అదే సమయంలో కేసీఆర్ మాటల్లో పస లేకపోవడం, గతంలో చెప్పిన మాటలనే వల్లెవేయడం వల్ల ప్రజలు కేసీఆర్ కి దూరమౌతూవచ్చారు. మరోవైపు నిరుద్యోగుల ఆవేదనని, ఆవేశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వారికి అండగా నిలిచాడు. లక్షలాది నిరుద్యోగుల గొంతుగా మారాడు. దీంతో యువతంతా రేవంత్ ప్రసంగాల పట్ల ఆసక్తి కనపరిచారు.
ఒకవైపు ఎన్నికలకు సిద్దమౌతునే మరోవైపు యుద్ధానికి కావాల్సిన తన జట్టును తయారు చేసుకున్నాడు. కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందులోనూ సీనియర్, జూనియర్ కొట్లాట కామన్. ఇంటగెలిచి, రచ్చగెలవాలన్నట్లుగా టి.పిసిసీ చీఫ్ హోదాలో అందరిలో టీం స్పిరిట్ ను నింపాడు. ఇందుకోసం కేవలం మాటలకే పరిమితం కాకుండా… సీనియర్లతో నేరుగా మాట్లాడాడు. అవసరం అయిన చోట సీనియర్ల ఇంటికే వెళ్లాడు. వారితో చర్చించాడు. వారితో స్నేహాన్ని పెంచుకున్నాడు. ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో ఆచరణలో పెట్టి చూపించాడు. అందుకే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా కనిపించే అసంతృప్తిని బాగా తగ్గించగలిగాడు. ఇక్కడే రేవంత్ సగం గెలిచాడు.
కాంగ్రెస్ టిక్కెట్లు అమ్ముకుంటోందన్న ఆరోపణను బలంగా తిప్పి కొట్టాడు రేవంత్. ఖానాపూర్ నియోజకవర్గలో హెడ్మ బొజ్జు పటేల్ వంటి నిరుపేద ఉద్యమకారుడికి టికెట్ కేటాయించాడు. దీంతో కేసీఆర్ టీం షాక్ తగిలింది. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. రాజకీయాల్లో సొంత బలగాన్ని కాపాడుకుంటునే… కొత్త బలగాన్ని పెంచుకోవాలి. ఈ దిశగా దృష్టి పెట్టాడు రేవంత్. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికల్ని దగ్గరుండి జరిపించాడు. ఈరెండు జరగకపోయంటే ఖమ్మంలో ఈ స్థాయిలో కాంగ్రెస్ బలపడేది కాదు. అదే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలతో సఖ్యతను పెంచుకున్నాడు. జానారెడ్డి సలహాలు తీసుకున్నాడు. తన కొడుకు జైవీర్ కు అన్నగా నిలుచుంటానని ఆత్మీయ స్పర్శ అందించాడు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో గౌరవ ప్రదంగా వ్యవహరించాడు. అవసరమైన ప్రతి చోటా వారి ప్రస్తావన తెస్తూ వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ వచ్చాడు రేవంత్ రెడ్డి. భట్టి విక్రమార్కతో కీలక ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు. పొలిటికల్ గా గ్రౌండ్ ని బలంగా ప్రిపేర్ చేసుకున్నాడు.
కాంగ్రెస్ పార్టీ ఆత్మను పట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఆది నుంచి కాంగ్రెస్ కు వెన్నెముక గా నిలుస్తోన్న గ్రామీణ ప్రజల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వైఫల్యాలను గ్రామీణ ప్రజల్లోకి పార్టీ బలంగా తీసుకువెళ్లేలా కృషి చేశాడు. ఇది పార్టీని… ప్రజలతో బాగా దగ్గర చేసింది. మా కష్టాల్ని వినేవారు దొరికారు అని గ్రామీణ ప్రాంత ప్రజలు అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో పొలిటికల్ మేనేజ్మెంట్ కు పదును పెట్టాడు. కొత్త వాళ్లకు ప్రోత్సహించాడు. ఎర్రబెల్లి వంటి మాస్ లీడర్ మీద 26 ఏళ్ల అమ్మాయి యశశ్విని రెడ్డిని పోటీకి నిలబెట్టాడు. అన్నీ తానై చూశాడు. ఆమెకు గెలుపులో కీ రోల్ పోషించాడు. షాద్ నగర్ నియోజకవర్గంలో ఎం.బి.సి. కులానికి చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన వీర్లపల్లి శంకర్ కు టికెట్ కేటాయించాడు. తనకు అన్ని రకాలుగా అండగా నిలిచాడు. కాంగ్రెస్ లో కొత్త రక్తాన్ని ఎక్కించాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చిట్టెం పరిణికా రెడ్డి, రాజేష్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, తో పాటు గద్వాల్ లో బిసీ వాదాన్ని బలంగా వినిపించేందుకు ప్రయత్నించాడు. కాకపోతే… అక్కడ ఉండే డీకే అరుణ ఇంపాంక్ట వల్ల సరితా ఓడిపోయింది. కానీ గద్వాల్ వంటి చోట బీసీ వాదానికి చోటు కల్పించడమే అతిపెద్ద విజయం..
గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బిఆర్ఎస్ లో చేరిన వారికి సరైన బుద్ధి చెప్పేలా యాక్షన్ ప్లాన్ రచించి, సక్సెస్ ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశాడు రేవంత్. ఇదంతా ఒకెత్తైతే ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ మార్కు స్పష్టంగా కనిపించింది. అలసటనేదే లేకుండా రోజుకు నాలుగైదు బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. సుడిగాలి పర్యటనలు చేశాడు. సుదీర్షంగా మీడియా ఇంటర్వ్యూలతో తన యాక్షన్ ప్లాన్ ను, పరిపాలనకు కావాల్సిన సమాలోచనలను ప్రజల ముందు పెట్టాడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీ లను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెల్లేలా కార్యకర్తల్ని పరుగులు పెట్టించడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో కూడా మంచి విజయాలు రాబట్టగలిగింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై పెట్టిన బాధ్యతను నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు రేవంత్ రెడ్డి. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా సొంత కష్టంతో… అదిష్టానం సహకారంతో తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురాగలిగాడు. సమకాలీన రాజకీయాల్లో బలమైన మాస్ లీడర్ గా ఎదిగాడు రేవంత్ రెడ్డి.