Pancharama Temples : కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే తులసీ లగ్నం, భీష్మ ఏకాదశి, వైకుంఠ చతుర్దశి, కార్తీక పౌర్ణమి రోజులతో పాటు మహాశివరాత్రి, ప్రతి సోమవారం ఈ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిపోతాయి. ఈ పంచారామాలు ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాల్లో కొలువుదీరాయి.
అమరారామం
గుంటూరు జిల్లా అమరావతిలో శివుడు అమరేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా ఇంద్రుడే ప్రతిష్టించాడని ప్రతీతి. కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని సందర్శించే భక్తుల ఎక్కువగా ఉంటుంది.
ద్రాక్షరామం
స్కంద ఖండితమైన శివలింగం రెండవ భాగము పడిన ప్రాంతమే “ద్రాక్షారామం”. దక్షుడు యజ్ఞం తలపెట్టిన ఈ ప్రాంతాన్నే “దక్ష వాటిక” అని కూడా పిలుస్తారు. ద్రాక్షరామం దక్షిణకాశీ గా కూడా పేరు. రాముడు శివుడ్ని కొలిచిన ప్రదేశంగా చెబుతుంటారు.
సోమారామం
పశ్చిమగోదావరి జిల్లా భీమరంలోని గునుపూడి ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు ఉమా సోమేశ్వర స్వామిగా ప్రసిద్ధి. ఇక్కడి లింగాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. సోమేశ్వరలింగం అమవాస్యరోజు గోధుమ, నలుపు రంగుల్లోను, పౌర్ణమి రోజు తెలుపు రంగులోను దర్శనమిస్తుందని స్థానికులు చెబుతుంటారు.
క్షీరరామం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శివుడు రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని మహా విష్ణువు ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. రెండున్నర అడుగుల ఎత్తులో పాలవర్ణంలో ఉన్న క్షీరరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కార్తీక మాసంలో భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
కుమారరామం
తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట కుమారరామం ఉంది. ఇక్కడ శివుడ్ని కుమారస్వామి ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ శివుడు బాలా త్రిపుర సుందరి సమేతుడై , కుమార భీమేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు.