Michaung Cyclone : చెన్నై వరదలు.. జనజీవన స్రవంతిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎందరో ఈ వరదల్లో చిక్కుకొని నానా అగచాట్లు పడుతున్నారు. ఈ తుపాను బీభత్సం ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కలకలం రేపుతోంది. ఈ తుపాను తాకిడికి సెలబ్రిటీలు బాధితులుగా మారడం కూడా వైరల్ అవుతోంది. తాజాగా ఈ తుపాను సృష్టించిన భీభత్సంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ చిక్కుకున్నాడు. అతనితోపాటు హీరో విష్ణు విశాల్ ఫ్యామిలీ సైతం ఈ వరద బాధితులయ్యారు.
విష్ణు విశాల్.. తన ఇంటి మేడ మీదకు ఎక్కి.. ఇంట్లో పవర్ లేదు.. ఇంటి నిండా వరద నీళ్లు చేరుకున్నాయి. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం.. సహాయం చేయండి.. ఫోన్ కి సిగ్నల్ వచ్చే ఒకే ఒక ప్రాంతం ఇది అంటూ.. తన పరిస్థితిని ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అలాగే తమతో పాటు ఇంకా సెలబ్రిటీలు ఇక్కడ ఉన్నారని కన్వే చేశాడు. ఎట్టకేలకు అతన్ని రక్షించడానికి చేరుకున్న రెస్క్యూ బృందం కాపాడిన వారిలో బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ కూడా ఉండడం చూసి అందరిని ఆశ్చర్యపరిచింది.
అమీర్ ఖాన్ అక్కడ ఎందుకు ఉన్నాడు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఫైనల్ గా అందర్నీ సురక్షితమైన ప్రాంతానికి తీసుకు వచ్చిన తర్వాత.. రెస్క్యూ బోట్స్ లో తన భార్య, మిగిలిన ఫ్యామిలీ సభ్యులు, అమీర్ ఖాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు విష్ణు విశాల్. అధికారులు వెంటనే స్పందించి తమని సురక్షితమైన ప్రాంతానికి చేర్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశాడు. తమను కాపాడిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది నిజంగా పరీక్షా సమయమని.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం ఎంతో గొప్పగా పనిచేస్తుందని.. అవిశ్రాంతిగా సహాయక చర్యలు అందిస్తున్నారని విష్ణు విశాల్ పేర్కొన్నాడు.
అమీర్ ఖాన్ తల్లి అనారోగ్య సమస్య కారణంగా చెన్నైలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. తల్లికి అవసరమైనప్పుడు అవైలబుల్ గా ఉండడం కోసం అమీర్ ఖాన్ తన పనులన్నీ మానుకొని తన మఖాం చెన్నైకి మార్చుకున్నాడు. అలా చెన్నైలో అమీర్ ఖాన్ ఉన్న ప్రాంతం మైచాంగ్ తుఫాను తాకిడికి అతలాకుతలం కావడంతో సుమారు 24 గంటలపాటు వరదలో చిక్కుకుపోయిన అమీర్ ఖాన్ ను.. అక్కడే ఉన్న యాక్టర్ విష్ణు విశాల్ కుటుంబ సభ్యులను ఫైర్ అండ్ రెస్క్యూ అధికారులు రక్షించారు.